సదాశివనగర్, మార్చి 4: అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్లో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివనగర్కు చెందిన విండో డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు జనార్దన్రెడ్డి (49), ఏనుగు ప్రతిభ (42) దంపతుల సమీప బంధువు సోమవారం పద్మాజీవాడిలో మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు స్కూటీపై ఉదయం బయల్దేరారు. పద్మాజీవాడి గ్రామ శివారులో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో సర్వీస్ రోడ్డు వెంట వెళ్లి మలుపు తిరుగుతున్న సమయంలో నిజామాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న గుర్తు తెలియని వాహనం స్కూటీని ఢీకొట్టింది.
దీంతో స్కూటీపై ఉన్న ప్రతిభ, జనార్దన్ల శరీరాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ప్రతిభ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన జనార్దన్ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ జనార్దన్ కూడా మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ పోలీసులు తెలిపారు.
మృతిచెందిన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉండగా ఒకరు గతంలో మృతి చెందారు. మరో కుమారుడు హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విండో డైరెక్టర్ ఏనుగు జనార్దన్ రెడ్డి దంపతులు మృతి చెందడంతో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, సర్పంచ్ బద్దం శ్రీనివాస్ రెడ్డి, విండో చైర్మన్ కమలాకర్ రావు, డైరెక్టర్లతోపాటు బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో దవాఖానకు తరలివచ్చారు.