సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం బడుగు జీవులకు కొండంత అండగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న రూ.10 లక్షల సాయం వేలాది కుటుంబాలకు ఆసరాగా నిలిచింది. దశాబ్దాల పాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుకు గురైన దళిత కుటుంబాలు ఇప్పుడు దర్జాగా బతుకుతున్నాయి. దళితబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 2,198 మందికి యూనిట్లు అందజేశారు. వారంతా వివిధ వ్యాపారాల్లో రాణిస్తూ తమ కాళ్లపై తాము నిలబడడమే కాక, ఇతరులకూ ఉపాధి కల్పిస్తున్నారు. రెండు జిల్లాల్లో రూ.219.80 కోట్ల విలువైన యూనిట్లు గ్రౌండింగ్ కావడమే కాక విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే, కొన్ని శక్తులు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. అసత్య ప్రచారాలు, అబద్ధాల వ్యాప్తిలో నిమగ్నమయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం అసంబద్ధ ఆరోపణలతో దళితుల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతున్నాయి. అయితే, ఇలాంటి తప్పుడు ప్రచారాలను ‘దళితబంధు’ లబ్ధిదారులు తిప్పికొడుతుండడంతో దుష్ట శక్తులు, ప్రతిపక్షాలు నోరెళ్లబెడుతున్నాయి.
నిజామాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజల జీవన విధానం చిందరవందరగా మార్చారు. ప్రభుత్వాల నుంచి సహకారం అన్నది లేకపోవడంతో తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యారు. ఫలితంగా చేతివృత్తుల విధ్వంసం జరిగింది. బడుగు, బలహీన వర్గాలైతే తీవ్రంగా వెనక్కి నెట్టివేయబడ్డాయి. సామాజిక వివక్షతతో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజలంతా పడిన ఇబ్బందులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలనలో కొంగొత్త వెలుగులు అందుతున్నాయి. అనేక చేతివృత్తులకు అండగా నిలుస్తూనే బలహీనవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఇందులో భాగంగానే దళితబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తీసుకువచ్చిన దళితబంధు పథకం ఇప్పుడు విజయతీరాలకు చేరుతున్నది. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారం తా నెలకు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదిస్తూ తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. కేసీఆర్ అం దించిన రూ.10లక్షల సాయంతో తమకు ఇష్టమైన యూనిట్లను స్థాపించి ప్రయోజనాలు పొందుతున్నా రు. దళితబంధు పథకం విజయవంతం అవుతున్న దరిమిలా రాష్ట్రంలో కొన్ని శక్తులు బురదజల్లే ప్ర యత్నం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలైతే లేనిపోని అసంబద్ధ ఆరోపణలతో ప్రజల ఆత్మైస్థెర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి కుట్రపూరిత వ్యా ఖ్యానాలకు ఉమ్మడి జిల్లాలో సంతోషంగా జీవిస్తున్న దళితబంధు పథకం అర్హుల అనుభవాలే గట్టి సమాధానంగా నిలుస్తుండడం విశేషం.
అమలు ఇలా…
దళితబంధు పథకంలో భాగంగా లబ్ధిదారులకు మంజూరైన రూ.10లక్షలు వారి బ్యాంక్ అకౌంట్లలోనే జమ అవుతాయి. కానీ వీటిని వ్యక్తిగత అవసరాలకు వెచ్చించరాదు. ఇందుకోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన లబ్ధిదారులకు అమలు చేసింది. సొంత అవసరాల కోసం నిధులు మళ్లించడం ద్వారా ప్రభుత్వం భావిస్తున్న భారీ ప్రయోజనం అన్నది ఆయా కుటుంబాలకు చేరదు. లబ్ధిదారు నేరుగా డ్రా చేసుకునేందుకు వీలులేకుండా నిబంధనలు పెట్టారు. దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారుడు తన ఇష్టపూర్వకంగా ఎంపిక చేసుకునే యూనిట్కు సంబంధించిన పేమెంట్ సైతం నేరుగా చెల్లింపులు జరుగుతాయి. సదరు వ్యాపార సంస్థకు నేరుగా లబ్ధిదారుని అకౌంట్ నుంచి పేమెంట్ జరుగుతుంది. ఒక యూనిట్లో రూ.10లక్షలకు అంతకన్నా తక్కువ వ్యయం అయితే మిగిలిన డబ్బులను సైతం సొంతానికి వెచ్చించేందుకు వీలు లేదు. వాటిని యూనిట్ను దీర్ఘకాలికంగా ఎలాంటి నష్టాలు సంభవించకుండా లాభదాయకంగా నడిపించేందుకు వినియోగించాల్సి ఉంటుంది. పథకం ఉద్దేశం పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. దీంతో లబ్ధిదారులు తమకిష్టమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి పొందే వీలు వందకు వంద శాతం దక్కనున్నది.
ఇచ్చిన మాట నెరవేరుస్తూ…
ఆరు నూరైనా.. దళితబంధు పథకాన్ని అమలు చేసి చూపిస్తామని 2020 ముగింపులో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని హుజూరాబాద్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లారు. నియోజకవర్గానికి వంద చొప్పున యూనిట్ల పంపిణీ పూర్తి కావడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరపడం మూలంగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కు 1500 యూనిట్ల వరకు మంజూరయ్యే వీలున్నదని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉండడంతో దాదాపుగా 15వేల నుంచి 18వేల దళితబంధు యూని ట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వేలాది మందికి దళితబంధు ప్రయోజనాలు దక్కబోతుండడంతో సంబంధిత వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యూనిట్లు దక్కించుకున్న వారి సక్సెస్ను చూస్తూ తాము కూడా ఆ స్థాయికి చేరుకోవాలని అభిలాషిస్తున్నారు. దళితబంధు పథకం అమలుపై ప్రతిపక్ష పార్టీలు అనేక అపోహలను సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ సర్కారు చిత్తశుద్ధి ముందు అవన్నీ ఫలించలేదు.
పేద కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు..
పేద దళిత కుటుంబాల్లో ఆర్థిక వెలుగులను ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. ఆయా కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి వివిధ రంగాల్లో ముందడుగు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వెనుకబడిన వారంతా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వ్యాపారవేత్తలుగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేందుకు బాటలు వేస్తున్నది. ఇంత భారీ మొత్తంలో ఓ పథకాన్ని నేరుగా నగదు బదిలీ చేస్తుండడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు. పూర్తిస్థాయి రాయితీతో ఎలాంటి కండీషన్లు, లబ్ధిదారుని వాటా లేకుండా అమలవుతున్న పథకంగా దళితబంధు చరిత్రకెక్కింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున నిజామాబాద్లో 550, కామారెడ్డిలో 350 యూనిట్లు మంజూరయ్యాయి. మొత్తం 900 మందికి దళితబంధు పథకం వర్తించింది. ఇక పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. 1298 యూనిట్లు మంజూరు కూడా జరిగింది. ఇలా ఉమ్మడి జిల్లాలో దళితబంధు ద్వారా 2,198 మందికి లాభం జరిగింది. యూనిట్లు మంజూరవ్వడంతోవీరంతా సొంతంగా ఆదాయాన్ని సృష్టించుకుంటూ స్వతంత్రంగా జీవిస్తున్నారు.
ఇదంతా కేసీఆర్ పుణ్యమే..
గోర్గల్ గ్రామానికి చెందిన మంగ ప్రకాశ్కు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెండ్లి చేసినా తన పిల్లలతో కలిసి తండ్రి ఉంటున్న గోర్గల్ గ్రామంలోనే ఉంటున్నారు. దళితబంధు పథకంలో ప్రకాశ్తోపాటు కుమారుడు పాల్దినాకర్, కుమార్తె నాగమణికి ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున మంజూరయ్యాయి. దీంతో ముగ్గురు కలిసి ఒకే యూనిట్ను ఎంపిక చేసుకున్నారు. వరికోత యంత్రంతోపాటు యంత్రంను మోసేందుకు ఓ ట్రాలీ కొనుగోలు చేశారు. మొత్తం రూ.30లక్షలతో ఆరు నెలల కిందట వరి కోత యంత్రం అందుకున్నారు. గత సీజన్లో 120 గంటలపాటు పంట నూర్పిళ్లు చేశారు. గంటకు రూ.2800 చొప్పున సంపాదించగా డీజిల్, డ్రైవర్ ఖర్చులు పోను గంటకు వెయ్యి చొప్పున నెల రోజుల్లో లక్షా 20వేల రూపాయల వరకు సంపాదించారు. మొన్నటి వరకు కూలీ పనులు చేసుకునే వీరికి నెల రోజుల్లో ఒక్కొక్కరు రూ.40వేల చొప్పున సంపాదించడం కేసీఆర్ పుణ్యమే అంటూ దేవుడితో సమానంగా కొలుస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్నాటకలో ఆరుతడి పంటల నూర్పిళ్లు ప్రారంభం కానున్నాయని అక్కడికి వెళ్లి పంట నూర్పిళ్లు చేస్తామని చెబుతున్నారు.
– మంగ ప్రకాశ్, పాల్ దినకర్, నాగమణి, గోర్గల్
రోజుకు వెయ్యి సంపాదిస్తున్న..
నా పేరు బుచ్చి సాయిలు దళితబంధు పథకం యూనిట్ మంజూరు కావడంతో గేదెలను కొనుగోలు చేసుకున్నాను. రెండు నెలల క్రితం ఎనిమిది గేదెలను తీసుకుంటే రెండు నెలల్లో వాటికి మూడు దూడలు పుట్టాయి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కలిపి సుమారు 20 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయి. ఖర్చులు పోను రోజుకు వెయ్యి రూపాయల వరకు సంపాదిస్తున్నాను. దళితబంధు పథకం రాకముందు నేను డ్రైవర్గా, నా కొడుకు క్లీనర్గా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పని చేస్తూ నెలకు రెండుసార్లు ఇంటికి వచ్చేవాళ్లం. రాత్రి, పగలు తేడా లేకుండా లారీ నడిపేవాళ్లం. అలాంటిది సీఎం కేసీఆర్ దయతో ఇంటి వద్ద నీడ పట్టున ఉంటూ గేదెలను మేపుతూ, పాలను విక్రయిస్తూ సంతోషంగా తలెత్తుకొని బతుకుతున్నాం.
-బుచ్చి సాయిలు, బంజపల్లి, నిజాంసాగర్ మండలం.
రూ.40వేలు ఆదాయం
దళితబంధు పథకం కింద నేను కారును తీసుకున్నాను. నాలుగు నెలల కిందట కారు అందించగా ప్రతి రోజూ కిరాయికి వెళ్తుండడంతో అన్ని ఖర్చుల పోను నెలకు రూ.40వేల వరకు మిగులుతున్నాయి. ఇప్పటి వరకు తిరుపతి, షిర్డీతోపాటు హైదరాబాద్కు కిరాయిపై వెళ్లాను. గతంలో బతుకుదెరువు కోసం వేరే గ్రామాలకు వెళ్లడంతోపాటు ఇంటి వద్ద ఏ పని దొరికితే ఆ పని చేసేవాడిని. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా నెలకు 40వేల వరకు సంపాదిస్తున్నాను. నాతోపాటు మా నాన్నకు ట్రాక్టర్ రావడంతో ఇద్దరం కలిసి నెలకు రూ.70వేల వరకు సంపాదిస్తున్నాము. ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బతుకుతున్నాం.
– అశోక్, అచ్చంపేట
దర్జాగా బతుకుతున్నాం..
నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ వాటర్ ప్లాంట్లో ఐదు రూపాయలకు ఒక డబ్బా నీటిని తీసుకొని రూ.20కి విక్రయిస్తున్నాడు. ఆరు నెలల కిందట హైదరాబాద్కు వెళ్లిన రాములు రోజుకు సుమారు 200 నుంచి 250 వరకు డబ్బాలను విక్రయిస్తుండగా డబ్బాకు రూ.15ల చొప్పున డీజిల్ ఖర్చులు పోగా రూ.2500 వరకు సంపాదిస్తున్నాడు. “ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా దళితబంధు పథకం అందించడంతో నేను రోజుకు రూ.2500వరకు సంపాదిస్తున్నాను. ఇంటి వద్ద మా అన్న కోళ్లఫారం కోసం దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం షెడ్డు పనులు సాగుతున్నాయి. ఇంటి వద్ద పొలం చూసుకుంటూ అన్న ఉండగా నేను దళితబంధు వాహనాన్ని తీసుకొని హైదరాబాద్లో దర్జాగా సంపాదించుకుంటున్నాను.”అని రాములు సంతోషంగా చెబుతున్నాడు.
– జంజురు రాములు, గోర్గల్, నిజాంసాగర్