కమ్మర్పల్లి, నవంబర్ 1 :మంత్రి వేముల నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం సమూల ప్రగతికి, అద్భుతమైన అభివృద్ధికి చిరునామాగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు కేసీఆర్ పాలనలో మోక్షం కలిగింది. తాగు, సాగునీటితో అల్లాడిపోయిన ‘అల్లకొండ’ నియోజకవర్గం ఇప్పుడు ఊట చెలిమెగా మారింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవం, లిఫ్ట్లు, చెక్డ్యాంల నిర్మాణంతో క‘న్నీటి’ కష్టాలకు చెక్పడింది. సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బాల్కొండను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్కు సన్నిహితుడిగా ఉన్న వేముల.. భారీగా నిధులు తేవడంతో అన్ని రంగాల్లో సమూల ప్రగతికి చిరునామాగా బాల్కొండ నియోజక వర్గం నిలిచింది.
పదేండ్ల ముందు బాల్కొండ నియోజకవర్గం సమస్యలమయంగా ఉండేది. నియోజక వర్గంలోనే ఎస్సారెస్పీ ఉన్నా ఉపయోగం సున్నా అనే పరిస్థితి ఉండేది. నాన్ కమాండ్ ఏరియా రైతులు బోరుబావులపైనే ఆధారపడేవారు. కరెంటు సరిపోక మోటార్లు కాలిపోయి పంటలు ఎండిపోయేవి. ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే మంత్రి ప్రశాంత్రెడ్డి దీనిపై దృష్టి సారించి అసెంబ్లీలో ప్రస్తావించారు. కొత్తగా 18 విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించి 3 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 5 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లు 45 ఏర్పాటు చేయించారు. కేసీఆర్ సహకారంతో రూ.2 వేల కోట్లతో ఎస్సారెస్పీ పునర్జీవం పథకం నిర్మించి ఎస్సారెస్పీతో పాటు నియోజకవర్గంలో సాగు నీటి రంగం మొత్తానికి కొత్త జీవం పోశారు. వరద కాలువను మూడు కాలాలు నిండుగా ఉంచుతూ చెరువులు నింపుకునేలా భారీ తూములు నిర్మించారు. రూ.2400 కోట్లతో ప్యాకేజీ21 ద్వారా.. నియోజక వర్గంలో ఎస్సారెస్సీకి దూరంగా ఉన్న భీమ్గల్, కమ్మర్పల్లి, వేల్పూర్, మోర్తాడ్ మండలాల్లో 78 వేల ఎకరాలకు సాగు నీటిని అందించుకుని దశాబ్దాల దారిద్య్రాన్ని దూరం చేసే అవకాశం కల్పించారు. నియోజక వర్గంలో 45 కిలోమీటర్ల పొడవునా వట్టి పోతున్న వాగులు 24 చెక్ డ్యామ్లతో భూగర్భ జల గనులుగా మారి వాగుల వెంట 32 గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.
ప్రజా ఆశీస్సులతో రెండుసార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన వేముల సీఎం కేసీఆర్ సహకారంతో రూ.600 కోట్లతో నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లోనూ బీటీ, సీసీరోడ్లు వేయించారు. భీమ్గల్ను మున్సిపాలిటీగా మార్చి, వంద కోట్లతో భీమ్గల్ రైపురేఖలు మార్చేశారు. మిగతా మండలాల కేంద్రాల్లో ఫోర్లేన్ రోడ్లు నిర్మించి, సెంట్రల్ లైటంగ్తో సౌకర్యవంతంగా మార్చేశారు. భీమ్గల్లో రూ.37 కోట్లతో వంద పడకల దవాఖానను మంత్రి వేముల మంజూరు చేయించారు. ప్రజల దశాబ్దాల కల నెరవేర్చి వైద్యరంగాన్ని బలోపేతం చేశారు. నియోజక వర్గంలో కొత్త పీహెచ్సీలు, గ్రామగ్రామాన హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేయించారు. 12 వేల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.50 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. తన సతీమణి, మిత్రుల సహకారంతో రూ.1.60 కోట్లతో ఆన్ని పీహెచ్సీల్లో ఆక్సిజన్ పడకల సౌకర్యం కల్పించి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆక్సిజన్ ఉత్పత్తి, బాటిలింగ్ యూనిట్ను ఏర్పాటు చేయించారు.