
Vemula Prashanth Reddy | నిజామాబాద్/బాల్కొండ, జనవరి 26 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమని కొనియాడారు. మనందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది మన భారత రాజ్యాంగమేనని వేముల కొనియాడారు. నాడు ఒక రాష్ట్రం నుండి మరొక ప్రాంతం విడిపోవాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ సమ్మతి తప్పనిసరి అని వాదించినప్పటికీ, అంబేద్కర్ తన దూరదృష్టితో చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో ‘ఆర్టికల్-3 ని పొందుపరిచారని గుర్తుచేశారు. ఆనాడు ఆంధ్రా పాలకులు తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా, అసెంబ్లీ తీర్మానంతో సంబంధం లేకుండా పార్లమెంట్ నిర్ణయంతో తెలంగాణ రావడానికి కారణం ఆ ఆర్టికల్-3 మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ దేశం మన అందరిదని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజ్యాంగ స్ఫూర్తితో దేశం ముందుకు వెళ్తోందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కొన్ని అపశృతులు దొర్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రజలకు, ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కును కల్పించిందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను గురించి అడిగితే పోలీసులను, సిట్ (SIT)లను, కమిషన్లను అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి నాయకులను విచారణల పేరుతో వేధించడం సరికాదన్నారు.
బొగ్గు టెండర్లలో సీఎం బంధువుల హస్తం
సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంలో జరిగిన భారీ అవినీతిలో సాక్షాత్తు ముఖ్యమంత్రి బంధువుల హస్తం ఉందని ఈ విషయంపై హరీష్ రావు ప్రశ్నిస్తే ఆయనకు, కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఈ కుంభకోణంపై ‘సిట్టింగ్ జడ్జి’తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సిట్ (SIT)లు, కమిషన్ల పేరుతో ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని హితవు పలికారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయవద్దని హెచ్చరించారు. అధికారులు, పాలకులు, ప్రతిపక్షాలు అందరూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే మహిళలకు నెలకు రూ.25వందలు, వృద్ధులకు రూ.4వేల పింఛన్, నవ వధువులకు తులం బంగారం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, రూ. 4,000 నిరుద్యోగ భృతి,రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, రూ. 15,000 రైతుబంధు, వడ్లకు రూ. 500 బోనస్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితోనైనా ప్రభుత్వం తన పద్ధతి మార్చుకొని, రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలని హితవు పలికారు. లేనిపక్షంలో రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పోరాడి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని, ప్రజలు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.