ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నది. ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించింది. గ్రామీణ పిల్లలందరికీ ఉచితంగానే ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులోకి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
పిట్లం, అక్టోబర్ 19: సర్కారు బడిలో ఇంగ్లిష్ మీడి యం చదువు బోధన ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రు లు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమ పిల్లలను ఎంచక్కా సర్కారు బడికి పంపించి ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తున్నారు. పేద, మధ్యతరగతి వారికి ఫీజుల బాధల నుంచి విముక్తి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై అన్నివర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాకుండా కోట్లాది రూపాయలతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి.
మెరుగైన సౌకర్యాలు.. తగ్గిన ఫీజు భారం
విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం చదువుపై ఎక్కువగా దృష్టిసారించారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు సమకూర్చి ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఫీజుల భారం తగ్గింది. ఇప్పటికే పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమ బోధన ప్రారంభించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం తండా ప్రాథమిక పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. విద్యార్థులను ఆకర్షించేలా ప్రహరీపై ఆంగ్లం, తెలుగు భాషలతో పెయింటింగ్ వేయించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులకు క్రీడాస్థలం, పరిశుభ్రమైన వంటగదులు ఏర్పాటు చేయడంతో మారుమూల గ్రామాల ప్రజలు ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారు.
ఆంగ్ల విద్య అమలు మంచి నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయడం చాలా బాగుంది. ప్రతి విషయంలోనూ దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకునే సీఎం కేసీఆర్ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను బలోపేతం చేయాలనే సంకల్పంతో తీసుకున్న చర్యలు బాగున్నాయి.
– దేవీసింగ్, మండల విద్యాశాఖ అధికారి, పిట్లం
పేద విద్యార్థులకు మేలు
సర్కారు బడిలో ఆంగ్లమాధ్యమం ప్రారంభించడంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. మా గిరిజన తండా ల్లో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో బోధించి, వారిని తీర్చిదిద్దడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్ అందించిన ఈ అవకాశాన్ని అందరం సద్వినియోగం చేసుకుంటాం.
– లక్ష్మీబాయిబాబూసింగ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్, పిట్లం