మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పాత మద్యం పాలసీ నవంబర్ 30తో ముగియనుండగా కొత్తగా జారీ చేసే లైసెన్సులు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. ఈ నెల 4 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డిలో 49 మొత్తం 151 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ సారి కూడా లైసెన్సు దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలుగా నిర్ణయించారు. మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం మేర రిజర్వేషన్ అమలు కానున్నది.
– నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
నిజామాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీవోను జారీ చేయడంతో మద్యం వ్యాపారులు, ఆశావహుల్లో ఉత్సాహం కనిపిస్తున్నది. గత మద్యం పాలసీలో పాల్గొని దుకాణాలు రాక నిరుత్సాహానికి గురైన వారు, ప్రస్తుతం మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్న వారంతా ఈసారి కూడా పాల్గొనేందుకు సిద్ధం అవుతున్నారు. ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 102, కామారెడ్డిలో 49 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించనున్నారు. ఈసారి కొత్త మద్యం దుకాణాల మంజూరుకు సంబంధించిన స్పష్టత రాలేదు. కొత్త మండలాల పరిధిలోని మద్యం విక్రయాలు మునుపటి మాదిరిగానే కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. 2021-23 మద్యం పాలసీ నవంబర్ 30కే ముగుస్తుంది. లక్కీ డ్రాలో నూతన మద్యం పాలసీ 2023-25లో వైన్ షాపు దక్కించుకున్న వారికి నవంబర్ 30 నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. వీరి వ్యాపారం డిసెంబర్ 1నుంచి షురూ అవుతుంది. ఈసారి కూడా గతంలో మాదిరిగానే లైసెన్సులకు దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు నిర్ణయించారు. దరఖాస్తు చేయాల్సిన వారు రూ.2లక్షలను ప్రభుత్వానికి చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనాల్సి ఉంటుంది.
మద్యం నూతన విధానంలో ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం ఆగస్టు 3న మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఆగస్టు 4న నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇదే రోజు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు. స్వీకరణకు ఆగస్టు 18 సాయంత్రం 6గంటల వరకు గడువు విధించారు. లైసెన్సుల జారీ ప్రక్రియను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఆగస్టు 21న ఉంటుంది. మద్యం దుకాణాలకు లైసెన్స్ దక్కించుకున్న వారంతా ఆగస్టు 22లోపు మొదటి ఇన్స్టాల్మెంట్ను చెల్లించాల్సి ఉంటుంది. మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న వారికి మద్యం సరఫరాను నవంబర్ 30 నుంచి కేటాయింపులు షురూ అవుతాయి. ఎక్సైజ్ పాలసీ ప్రకారం డిసెంబర్ 1నుంచి కొత్త దుకాణాలు మనుగడలోకి వస్తాయి. ఈ నూతన మద్యం విధానం 2023-25 వరకు అమల్లో ఉంటుంది. రెండేండ్ల కాల పరిమితికి మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేస్తారు. ప్రభుత్వ జీవో విడుదలతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. సర్కారు మార్గదర్శకాల మేరకు నూతన మద్యం పాలసీలో దుకాణాల కేటాయింపు కోసం ఏర్పాట్లను షురూ చేసింది. లైసెన్సుల జారీకి ఏర్పాట్లు జరుగుతుండగా అత్యధికంగా మద్యం విక్రయించే దుకాణాల వివరాలను ఆరా తీయడంలో ఔత్సాహికులు మునిగితేలుతున్నారు.
నూతన ఎక్సైజ్ పాలసీ 2023-25కు ఔత్సాహికుల నుంచి స్పందన భారీగానే ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తున్నది. గడువుకు చివరి రోజు వరకు అప్లికేషన్లు ముంచుకు వచ్చే అవకాశాలుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయబోతున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. గత మద్యం పాలసీలోనూ దరఖాస్తు ఫీజు రూ.2లక్షలుగానే విధించారు. వ్యాపారులు సిండికేట్గా మారడంతో సర్కారుకు రావాల్సిన ఆదాయం తగ్గుతోంది. గతంలో ఇదే తీరు కనిపించింది. ఒక్కొక్కరూ వివిధ దుకాణాలకు దరఖాస్తులు సమర్పిస్తే వచ్చే ఆదాయం ఎక్కువ. కానిక్కడ చాలా మంది కలిసి ఒక్కో దుకాణానికి పంపకం రూపంలో దరఖాస్తులు చేస్తున్నారు. దుకాణాల కోసం పోటీ పడడం కన్నా కలిసి కట్టుగా దరఖాస్తు చేసుకుని… డ్రాలో వచ్చే దుకాణాలను పంచుకోవాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని తెర వెనుక ఆబ్కారీ శాఖ వారే ప్రోత్సహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. నిజామా బాద్ జిల్లాలో 102 మద్యం షాపులు ఉండగా, గౌడ కులస్తులకు 11, ఎస్సీలకు 11, ఎస్టీలకు 2 చొప్పున కలిపి మొత్తం 24 షాపులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనున్నారు. మిగిలిన 78 దుకాణాలకు ఓపెన్ టెండర్ నిర్వహించనున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులు ఉండగా, గౌడ కులస్తులకు 7, ఎస్సీలకు 5, ఎస్టీలకు కలిపి 14 షాపులను రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించనున్నారు. మిగిలిన 35 మ ద్యం దుకాణాలకు ఓపెన్ టెండర్ నిర్వహించనున్నారు.