మెండోరా : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో దిగువ గోదావరిలోకి 99,840 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్లోకి ఒక లక్షా 18,200 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఆయన వివరించారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎసీలు) సామర్థ్యం కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్ నీటిమట్టం 1090.70 అడుగులు (88.662 టీఎంసీల) నీటినిల్వ ఉందని పేర్కొన్నారు.
కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800 , లక్ష్మి కాలువకు 80 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతుందన్నారు. అలీసాగర్ ఎత్తి పోతల పథకానికి నీటివిడుదల నిలిపివేసినట్లు చెప్పారు. ఈ సీజనులో ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 582.873 టీఎంసీల వరద నీరు వచ్చిందని ఏఈఈ తెలిపారు.