నీళ్లు, నిధులు, నియామకాల నినాదం సాకారం అవుతున్నది. స్వరాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగుతున్నది. రాష్ట్ర కల సాకారమైన నాటి నుంచే ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నది. సమైక్య పాలనలో కొలువుల కోసం ఎదురుచూసి వేసారి పోయిన యువత వలసబాట పట్టింది. ప్రైవేటు సంస్థల్లో చాలీచాలని వేతనాలతో జీవితాలను వెల్లదీశారు. కానీ.. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేసింది. ఉద్యోగ ప్రయత్నాలు వదులుకున్న యువతకు నోటిఫికేషన్లు ఆశాకిరణంలా మారాయి. నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించి కష్టపడి కొలువులు సాధించారు. పోలీసు, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తీర్ణాధికారులు.. ఇలా వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీని రాష్ట్ర సర్కారు చేపట్టింది. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రతిభకు పట్టం కడుతూ.. పారదర్శకంగా, పైరవీలకు ఆస్కారం లేకుండా కొలువులను భర్తీ చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తాము పూర్తి భరోసాతో కష్టపడి చదివి కొలువు దక్కించుకోగలిగామని గుర్తు చేసుకుంటున్నారు. స్వరాష్ట్ర ఫలాలు యువతకు అందుతున్నాయని హర్షం వ్యక్తంచేస్తున్నారు.
పారదర్శకతతోనే ఎస్సై ఉద్యోగం వచ్చింది..
నా చిన్నప్పుడే అమ్మ, నాన్న చనిపోయారు. మా అన్న మల్లికార్జున్ నన్ను చదివించారు. తప్పకుండా ఉద్యోగం సాధించాలని ప్రోత్సహించేవాడు. టీఎస్పీఎస్సీ ద్వారా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేశారు. అప్పుడు నేను ఎస్సై పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నా. చాలా కష్టపడి చదివి, సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాను. 2020లో పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆబిడ్స్లో పనిచేస్తున్నా. రిక్రూట్మెంట్ అంతా పారదర్శకంగా నిర్వహించడంతోనే నాలాగా కష్టాన్ని నమ్ముకున్నవారికి ఉద్యోగాలు వచ్చాయి.
– కోయిగూర్ నిరంజన్(కోటగిరి )ఎస్సై, ఆబిడ్స్
ఒకప్పుడు సర్కారు కొలువులంటే డబున్నోళ్ల పని. గరీబోళ్ల పిల్లలు చదువుకుంటేనే సరిపోయేది కాదు. డబ్బులు చేతిలో పట్టుకొని పైరవీలు చేస్తేగానీ ప్రభుత్వ ఉద్యోగం వచ్చేది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ లేక ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవితం వెల్లదీశారు. సర్కారు కొలువు కోసం యువత కన్న కలలు స్వరాష్ట్రం వచ్చాక నిజమయ్యాయి. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. దీనిని యువత సద్వినియోగం చేసుకొని ఉమ్మడి జిల్లాలోని ఎందరో యువతీయువకులు జాబ్ కొట్టారు. ఇదంతా తాము కష్టపడడంతోనే సాధించినట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా రిక్రూట్మెంట్ నిర్వహించడంతోనే తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని అంటున్నారు.
ఉద్యోగం వస్తదని అనుకోలేదు..
డిచ్పల్లి, మార్చి 19 : ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశా. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే టీఎస్పీఎస్సీ నుంచి ఏఈవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో వెంటనే ఐప్లె చేశాను. ఉద్యోగం వస్తదని అనుకోలేదు. పైరవీలు, లంచాలు ఉంటాయని అనుకున్నా. అమ్మనాన్న ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. రోజుకు 8 గంటలపాటు కష్టపడి చదువుకొని ఏఈవోగా ఎంపికయ్యాను. ఇది రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశంగా భావిస్తున్నా.
-భావన, ఏఈవో, ఖిల్లా డిచ్పల్లి
కోచింగ్ తీసుకొని కష్టపడి చదివిన..
కోటగిరి, మార్చి 19 : తెలంగాణ రాకముందు నోటిఫికేషన్లు లేకుండె. కేసీఆర్ సీఎం అయ్యాకనే టీఎస్పీఎస్సీ ద్వారా వరుసగా నోటిఫికేషన్లు వేస్తున్నారు. మా అమ్మ, నాన్న చాలా కష్టపడి నన్ను చదివించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ఐప్లె చేయించి కోచింగ్ కూడా ఇప్పించారు. నేను కూడా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. నాయకులు, పైరవీకారులను పట్టుకొని తిరుగాల్సిన అవసరం రాలేదు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ పంచాయతీలో పని చేస్తున్నా.
-ఏముల ఉమాకాంత్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎత్తొండ
మా కుటుంబం కలలు ఫలించాయి..
బాన్సువాడ టౌన్, మార్చి 19 : మా తల్లిదండ్రులు కూలీనాలీ చేసుకొని చదివించారు. మా కుటుంబం మొత్తం నామీదే ఆశలు పెట్టుకున్నది. నేను 2018లో గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాను. అప్పుడే టీఎస్పీఎస్సీ నుంచి పోలీసు శాఖలో నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసుకున్నాక కోచింగ్ తీసుకునే స్థోమత లేకుండె. బాన్సువాడలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెంటర్లో ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలుసుకొని అక్కడే ప్రిపేర్ అయ్యాను. పైరవీలు, లంచాల జోలికి పోవొద్దని అప్పుడే చెప్పారు. మా తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. కష్టపడి చదువుకోవాలన్నారు. ప్రతిరోజూ 8-10 గంటలపాటు చదివేవాన్ని. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం కలలు ఫలించాయి. ఒక లక్ష్యంతో కష్టపడితే తప్పక ఫలితం వస్తుందని నమ్మకం కలిగింది. ఆ భరోసాతోనే మరోసారి ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే పోటీ పరీక్షలో పాసయ్యాను. ప్రస్తుతం ఈవెంట్స్లో అర్హత సాధించేందుకు కష్టపడుతున్నా. ఇతరులకు కూడా ఫిజికల్ టెస్టుకోసం శిక్షణ ఇస్తున్నా.
-మాలోవత్ సుధాకర్, ఏఆర్ కానిస్టేబుల్, బాన్సువాడ
ఎస్సై ఉద్యోగం కూడా వస్తది..
లింగంపేట, మార్చి 19: నేను మా స్వగ్రామం పోల్కంపేటలోనే పదో తరగతి వరకు చదువుకున్నా. ఇంటర్ కామారెడ్డిలో పూర్తి చేశాను. అప్పటి నుంచే ఉద్యోగాల కోసం ప్రయత్నించాను. టీఎస్పీఎస్సీ ద్వారా పోలీస్ శాఖలో నోటిఫికేషన్లు వచ్చాయి. కానిస్టేబుల్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నా. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపన ఉండేది. పైరవీల గురించి ఆలోచించలేదు. కోచింగ్ తీసుకొని కష్టాన్నే నమ్ముకుకొని మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగాన్ని సాధించాను. ప్రస్తుతం బైంసా పట్టణంలోని బెటాలియన్లో పనిచేస్తున్నా. ఎస్సై ఉద్యోగం కోసం కూడా సిద్ధమవుతన్నా. కష్టపడితే చాలు అది కూడా వస్తదనే నమ్మకం ఏర్పడింది.
-గూడురు హరీశ్ గౌడ్, బెటాలియన్ కానిస్టేబుల్, పోల్కంపేట.
టీఎస్పీఎస్సీ ద్వారానే మూడు కొలువులు..
బీర్కూర్, మార్చి 19: బీర్కూర్ మండలకేంద్రంలోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన పెండ్యాల నాగరాజు-భారతి దంపతుల కుమార్తె మౌనిక. ఈమె ఒక్కటి కాదు.. ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అవికూడా టీఎస్పీఎస్సీ ద్వారానే. తల్లిదండ్రుల కష్టాలను దూరంచేసి వారి కలలను నిజం చేసింది. కష్టపడేతత్వం, తెలివితేటలు ఉన్నవారికే కొలువులు వస్తాయని ఆమె నిరూపించింది. మౌనిక పదో తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకున్నది. ఇంటర్, బీటెక్ హైదరాబాద్లో పూర్తిచేసింది. చదువు పూరికాగానే టీఎస్పీఎస్సీ మొదటిసారి 2018లో నోటిఫికేషన్లు వేయడంతో పంచాయతీరాజ్ సెక్రెటరీగా జాబ్ సాధించింది. పిట్లం మండలంలో పని చేస్తూనే అదే ఏడాది జూన్లో వీఆర్వోగా ఉద్యోగం సాధించింది. నసురుల్లాబాద్ మండలం మిర్జాపూర్ గ్రామంలో విధులు నిర్వహించింది. మరోసారి 2021లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించి ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్నది. ఇదంతా తన కృషితోనే సాధ్యమైందని మౌనిక తెలిపారు. తనలాగా కష్టపడిన తన స్నేహితులకు కూడా టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు వచ్చాయని ఆమె గుర్తుచేశారు. రాష్ట్రంలోని యువతకు టీఎస్పీఎస్సీ.. ఓ వరంలా మారిందని అన్నారు. రేషన్డీలర్గా పనిచేసే తన తండ్రి చిన్నప్పటి నుంచి కష్టపడి లక్ష్యంతో చదువుకోవాలని ప్రోత్సాహించేవారని తెలిపారు.
తెలివైనోడకి బరాబర్ సర్కారు కొలువు వస్తది..
ముప్కాల్ మార్చి 19: నేను ఆటో డ్రైవర్. నా భార్య టైలర్ పని చేస్తది. రోజూ ఇద్దరం కష్టపడితేనే పూట గడుస్తది. అలాంటిది మా కొడుకు సాయితేజ్ను బాగా చదివించాం. ఏదో ఒక ఉద్యోగం చేస్తడని ఆశలు పెట్టుకున్నాం. పోలీస్ కొలువు కోసం దరఖాస్తు పెట్టుకున్నా అన్ని చెప్పి ఎన్నో దినాలు పొద్దూ మాపూ సదువుకునేటోడు. సర్కారు కొలువులంటే పైసలతోని పని అనుకున్నం. ఉద్యోగం వస్తదనే నమ్మకం లేకుండె. కానీ వాడి కష్టం చూస్తే కొంత భరోసా కలిగేది. పరీక్షలు రాసినంక కొన్ని రోజులకు ఉద్యోగం వచ్చిందని చెప్పిండు. అప్పుడు నమ్మకం ఏర్పడ్డది. తెలివైనోడికి బరాబర్ కొలువొస్తది. కేసీఆర్ ప్రభుత్వం సల్లగుండాలె.
-రాములు-లావణ్య, కానిస్టేబుల్ సాయితేజ్ తల్లిదండ్రులు, వేంపల్లి
మా నాన్న కష్టానికి ఫలితం దక్కింది..
కోటగిరి, మార్చి 19 : మాది కోటగిరి ఉమ్మడి మండలంలోని సుంకిని గ్రామం. అమ్మ జ్యోతి గృహిణి, నాన్న గంగాధర్ వ్యవసాయం చేస్తూ చదివించారు. 2012-14లో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సీడ్ టెక్నాలజీ కోర్సు చేశాను. 2015లో టీఎస్పీఎస్సీ ద్వారా ఏఈవో ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ వేయడంతో దరఖాస్తు చేసుకున్నా. పోటీ పరీక్షల్లో 300లకు 153 మార్కులు వచ్చాయి. మాది వ్యవసాయ కుటుంబం కావడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని అనుకున్నా. నాపై ఎన్నో ఆశలు పెట్టుకొని చదివించిన అమ్మ, నాన్న కష్టానికి ఫలితం దక్కింది. ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది..
– అనూజ, ఏఈవో సుంకిని
ఆర్నెల్ల వ్యవధిలో రెండు ఉద్యోగాలు..
బోధన్, మార్చి 19: ఈ ఫోటోలో ఉన్నది ప్రభుత్వ ఉద్యోగి గోవూరి మహిత.. ఒకపక్క ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ ఫస్టియర్ చదువుతూనే.. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు ఉద్యోగ పోటీ పరీక్షలు రాసి తన ప్రతిభను చాటుకున్నారు. ఆ రెండు ఉద్యోగాలకు కేవలం ఆర్నెల్ల వ్యవధిలో ఎంపికై చిన్న వయస్సులోనే స్థిరపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా, ఎటువంటి పైరవీలకు తావులేకుండా పోటీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తనలాంటి వారెందరో ప్రభుత్వ ఉద్యోగాలను పొందగలిగారని గోవూరి మహిత అంటున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ నీటిపారుదలశాఖ సీఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిత స్వగ్రామం ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామం. మహిత తల్లిదండ్రులు సాయిరెడ్డి, మంజుల దంపతులది మధ్యతరగతి కుటుంబం.. మహిత చిన్నప్పటినుంచే చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన మహితకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో జారీచేసిన రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వరంగా మారాయి. జూనియర్ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో కొలువులకు దరఖాస్తు చేసుకొని రెండు ఉద్యోగాలూ సాధించారు. ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా, అనంతరం వీఆర్వోగా పని పనిచేశారు. వీఆర్వో వ్వవస్థను రద్దుచేసిన ప్రభుత్వం మహితను నీటిపారుదలశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమించింది.
పారదర్శకతతోనే ఉద్యోగం వచ్చింది..
డొంకేశ్వర్, మార్చి 19: మాది డొంకేశ్వర్ మండంలోని సిర్పూర్ గ్రామంలో రైతు కుటుంబం. మా అమ్మానాన్న రాజవ్వ, లింగారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ చదివించారు. అన్న, వదిన ప్రోత్సాహంతో హైదరాబాద్లో ఎంసీఏ పూర్తిచేశారు. ఆదే సమయంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో టీఎస్పీఎస్సీ నుంచి జాబ్ నోటిఫికేన్ వేశారు. దరఖాస్తు చేసుకొని ఎలాగైనా జాబ్ కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నా. ప్రతిరోజూ గంటల తరబడి చదువుకునేవాడిని. 2019 ఫిబ్రవరి 9న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా సిరికొండ రేంజ్ తూంపల్లిలో పోస్టింగ్ వచ్చింది. రిక్రూట్మెంట్ను టీఎస్పీఎస్సీ పకడ్బందీగా నిర్వహించడంతోనే నిరంతరం కష్టపడ్డ నాకు ఉద్యోగం వచ్చింది.
-గంగారెడ్డి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, సిర్పూర్
నా కష్టాన్నే నమ్ముకున్నా..
ఎల్లారెడ్డి, మార్చి 19: ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల గ్రామంలో మాది వ్యవసాయ కుటుంబం. చేవెళ్లలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిప్లోమా చేశాను. అప్పుడే ఏఈవో పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేశాక ఏమాత్రం టైంవేస్ట్ చెయ్యకుండా ప్రిపేర్ అయ్యాను. 2017లో పరీక్ష రాశాను. ఎవరికీ లంచాలు ఇవ్వలేదు.. ఎవరిద్వారా పైరవీలు చేయలేదు. నా కష్టాన్నే నమ్ముకున్నా. 2018లో నాకు పోస్టింగ్ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేపట్టడంతోనే నాకు కొలువు వచ్చింది.
-పోలీసు ప్రశాంత్ కుమార్, ఏఈవో, పర్మళ్ల
లైబ్రరీకి వెళ్లి చదువుకునే వాడిని..
బాల్కొండ, మార్చి 19 : మాది బాల్కొండ మండలకేంద్రం. మా నాన్న కూలీ, అమ్మ బీడీలు చేస్తూ కష్టపడి చదివించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అనుకునేవాడిని. అదే లక్ష్యంతో కష్టపడి ఎంఏ, బీఈడీ పూర్తిచేశాను. ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్లు వచ్చినా ఐప్లె చేసేవాడిని. టీఎస్పీఎస్సీ ద్వారా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. మాది పేద కుటుంబం కావడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ప్రతిరోజూ పదిగంటలకు పైగా చదివేవాడిని. స్టడీ మెటీరియల్ కోసం ప్రతిరోజూ లైబ్రరీకి వెళ్లి చదువునేవాడిని. 2019లో ఏప్రిల్ 12న జాబ్ అపాయింట్మెంట్ వచ్చింది. ప్రస్తుతం మెండోరా మండలం బుస్సాపూర్లో డ్యూటీ చేస్తున్నా.
-నాగడి భోజన్న, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, బుస్సాపూర్
మా తమ్ముడికి కూడా ఉద్యోగం వస్తదనే నమ్మకం కలిగింది..
నిజాంసాగర్, మార్చి19: మాది మద్నూర్ మండల కేంద్రం. నాన్న శంకర్, అమ్మ లక్ష్మి. తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లిదండ్రులు కష్టపడి ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదివించారు. నేను ఉద్యోగం సాధిస్తానని మా తల్లిదండ్రులకు చాలా నమ్మకం ఉండేది. కేసీఆర్ ప్రభుత్వం 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన రిక్రూట్మెంట్లో మండల వ్యవసాయశాఖ అధికారిగా ఉద్యోగం సాధించాను. రిక్రూట్మెంట్ అంతా పకడ్బందీగా నిర్వహించడంతోనే కష్టపడినవారికి ఉద్యోగాలు వచ్చాయి. మా తమ్ముడు కూడా తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడని మాకు నమ్మకం కలిగింది.
-అమర్ప్రసాద్, నిజాంసాగర్ మండల వ్యవసాయశాఖ అధికారి
కష్టపడ్డవారికి కొలువులొచ్చాయి..
శక్కర్నగర్, మార్చి 19: మాది ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామం. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో అమ్మ గంగామణి కష్టపడి చదివించింది. పదో తరగతివరకు మా ఊళ్లోనే చదువుకున్నా. ఇంటర్ పూర్తయ్యాక ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చదివాను. అప్పుడే పోలీస్ రిక్రూట్మెంట్ కోసం 2018 నోటిఫికేషన్ వచ్చింది. కష్టపడి పరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగానికి ఎంపికయ్యాను. 2020లో వరంగల్లో 9 నెలల శిక్షణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పోస్టింగ్ ఇచ్చారు. రూపాయి ఖర్చుపెట్టకుండా ఉద్యోగం వచ్చింది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లతో పేద కుటుంబాలకు చెందిన చాలా మంది ఉద్యోగాలు సాధించారు.
-కట్టబాబు, కానిస్టేబుల్, పోచారం