బోధన్, జూలై 28: కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్నది. క్రయ, విక్రయాలు తగ్గడంతో వ్యాపారం డీలా పడిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. నిత్యావసరాలను కొనుక్కోవడానికే వెనుకాడుతున్న ప్రస్తుతం రోజుల్లో పెట్టుబడి రూపంలోనో, భవిష్యత్తు అవసరాల కోసమో ఖాళీ స్థలాలు, పొలాలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు.
జిల్లాలో రెండేండ్ల క్రితం రియల్ జోరు కనిపించగా ప్రస్తుతం పరిస్థితి మారింది. భూములు, ప్లాట్ల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. భవిష్యత్తులో అవసరాలకు ఆదుకుంటాయనే దూరదృష్టితో కొనుగోలు చేసిన భూములను అమ్ముదామంటే కొనేవారు కరువయ్యారు. రోజుకో వెంచర్ వెలుస్తుండగా కొనేవారులేక వెలవెల బోతున్నాయి. సుమారు మూడేండ్లుగాప్లాట్ల అమ్మకాలు లేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తొలి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగునీటి సౌకర్యం, వ్యయసాయ ఉత్పతులకు గిట్టుబాటు ధరలు లభించడంతో వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ ఏర్పడింది. క్రమంగా వాటి ధరలు మూడేండ్ల క్రితం వరకూ పెరుగుతూ వచ్చాయి. రైతులే ప్రధానంగా ఉన్న జిల్లాలో వారి నిజ ఆదాయం పెరిగింది. ప్లాట్ల క్రయ, విక్రయాలూ పెరిగాయి.
నిర్మాణ రంగం ఊపందుకున్నది. రెండున్నరేండ్ల క్రితం రాష్ట్రంలో అధికారం మారడంతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొన్నది. భూములు, ప్లాట్ల కొనగోళ్లు నిలిచిపోయా యి. వాస్తవాలు ఇలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం పట్టణాలు, గ్రామాల్లోని భూముల విలువలను పెంచడంతో మూలిగే నక్కపై తాటి పడ్డట్టయింది. ఒకపక్క మార్కెట్లో వ్యవసాయ భూములు, ప్లాట్ల ధరలు తగ్గిపోయాయి. అయినకాడికి అమ్ముదామన్నా కొనేవారే కరువయ్యారు. భూముల ధరలు తగ్గిపోతుండగా.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం రిజిస్ట్రేషన్ల ఆదాయం కోసం భూముల విలువలను గత నెల 5న పెంచింది.
కొన్ని నెలలుగా జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గిపోతూ వస్తున్నది. కాగా, భూముల విలువ పెంపు కారణంగా నెలన్నర రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పడిపోయింది. వ్యవసాయ భూములు, స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. గతంలో బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నెలకు ఐదారు లక్షల రూపాయల చొప్పున రిజిస్టేషన్ల ద్వారా ఆదాయం వచ్చేది. భూముల లావాదేవీలు తగ్గడంతో కొన్ని నెలలుగా ఆదాయం రూ. రెండు లక్షలకు మించడంలేదు. రిజిస్ట్రేషన్ల కోసం భూముల విలువలో 5.5 శాతం స్టాంప్ డ్యూటీ, 1.5 శాతం ట్రాన్స్ఫర్ డ్యూటీ (టీడీ), 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు.. ఇలా మొత్తం 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
భూముల విలువలను విపరీతంగా పెంచడంతో ఈ భారాన్ని క్రయ విక్రయ దారులు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో ప్రతిరోజూ 60కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడా సంఖ్య సగానికి పడిపోయింది. బ్యాంకు రుణాలకు సంబంధించిన మార్టిగేజ్, రిలీజ్ రిజిస్ట్రేషన్లు, గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు.. ఇలా అన్ని రకాల రిజిస్ట్రేషన్లపై ప్రభావం కనిపిస్తున్నది. బోధన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒకప్పుడు నెలకు 1200 నుంచి 1500 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. కార్యాలయంలో ఇప్పుడా రిజిస్ట్రేషన్ల సందడి కనిపించడంలేదు.
ఏప్రిల్లో 691, మే నెలలో 824, జూన్లో 776 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఈ నెలలో ఇప్పటివరకు కేవలం 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే కావడం గమనార్హం. ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను గమనించి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. మరోపక్క సామాన్యులపై భారం పడకుండా భూముల విలువను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.