బోధన్, ఫిబ్రవరి 21: పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ‘మాతృభాష సాహిత్య సేవా శిరోమణి’ అవార్డును మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అందుకున్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రాష్ర్టాల్లో తమ మాతృభాషల అభివృద్ధి, వికాసం కోసం కృషిచేసినవారికి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ‘మాతృభాష సాహిత్య సేవా శిరోమణి’ అవార్డును ప్రకటించాయి.
ఇందులో తెలంగాణలో ఉర్దూ భాషకు సంబంధించి రజాక్ను అవార్డుకు ఎంపికచేశారు. రజాక్ మాతృభాష ఉర్దూ భాష అయినప్పటికీ ఆ భాషతో పాటు తెలుగు, లంబాడా బంజారా భాషల్లో ఆయనకు ప్రావీణ్యం ఉంది. అవార్డు ఎంపికలో నిర్వాహకులు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. విజయవాడ గవర్నర్పేట్లోని హోటల్ పార్క్ ఐరీస్ ప్రైమ్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డును ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రజాక్కు అందించి సన్మానించారు.