ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రేపు (సోమవారం) కామారెడ్డి జిల్లాకు రానున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.32 కోట్లతో, కామారెడ్డి నియోజకవర్గంలో రూ.21 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లారెడ్డిలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరానున్నారు. వారం వ్యవధిలోనే కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో రెండోసారి పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తున్నది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ జనంలోకి దూసుకెళ్తున్నది. అధికార పార్టీ దూకుడు చూసి ప్రతిపక్షాలు నోరెళ్లబెడుతున్నాయి.
నిజామాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 9న ఇందూరు పర్యటనతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపిన కేటీఆర్.. ఈ నెల 14న కామారెడ్డి జిల్లా టూర్తోనూ అదే స్థాయిలో ఉత్సాహాన్ని నింపనున్నారు. వారం రోజుల వ్యవధిలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొననున్నారు. కేటీఆర్ రాక సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే జాజాల సురేందర్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేటీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీ జనసమీకరణతోపాటు ఎల్లారెడ్డి పట్టణాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకు కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్లారెడ్డిలో రూ.32 కోట్లతో అభివృద్ధి పనులు
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలంలో రూ.2.5కోట్లతో చేపట్టనున్న స్పోర్ట్స్ స్టేడియానికి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై రూ.5కోట్లతో నిర్మించిన హైలెవల్ వంతెన, ఇక్కడే రూ.3.54కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రారంభిస్తారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పట్టణవాసుల కోసం రూ.80లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభిస్తారు. పాత ఆర్టీసీ బస్డాండ్ స్థానంలో రూ.4.20కోట్లతో కొత్తగా నిర్మించినున్న బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనే జీ కాలువల నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరుకాగా.. ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనున్నది. ఎల్లారెడ్డిలో వెజ్ అండ్ నాన్ వెజ్ సమీకృత మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.2కోట్లతో శంకుస్థాపన చేయనున్నారు, రూ.4కోట్లతో చేపట్టనున్న పురపాలక నూతన కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఎల్లారెడ్డి పట్టణంలో మొత్తం ఎనిమిది కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొననున్నారు. పట్టణంలో సుడిగాలి పర్యటన చేస్తారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన అనంతరం జీవదాన్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో మంత్రి పాల్గొంటారు.
కామారెడ్డిలో ఏర్పాట్లు ముమ్మరం
కామారెడ్డి జిల్లా ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. మున్సిపాలిటీ పరిధి విస్తరణకు నోచుకోవడంతోపాటు కేటీఆర్ దూర దృష్టితో రూ.వందల కోట్లు నిధులు వెచ్చించగా సర్వాంగ సుందరంగా కామారెడ్డి పట్టణం ముస్తాబైంది. 2016 నాటికి కేవలం డబుల్ రోడ్డుతో కుదేలైన పరిస్థితుల నుంచి పట్టణంలో ఇప్పుడు ఆరు వరుసల బీటీ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈఎస్ఆర్ గార్డెన్ నుంచి టేక్రియాల్ వరకు రూ.11కోట్లతో ఆరు లైన్ల రోడ్డు, రూ.7కోట్లతో ఈఎస్ఆర్ నుంచి నర్సన్నపల్లి వరకు నాలుగు నుంచి ఆరు లైన్ల బీటీ రోడ్డు, రూ.2.45కోట్లతో ఈఎస్ఆర్ గార్డెన్ నుంచి కళాభారతి వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్తో పాటుగా రూ.61లక్షలతో నర్సన్నపల్లి వద్ద నిర్మించిన స్వాగత తోరణాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేక చొరవతో కామారెడ్డి పట్టణం అద్భుతంగా రూపాంతరం చెందింది. కేటీఆర్ తాజా పర్యటనలో భాగంగా కామారెడ్డిలో దాదాపుగా రూ.21కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమైనందున బీఆర్ఎస్ పార్టీ సైతం దూకుడు ప్రదర్శిస్తోంది. ఎన్నికల కదనరంగంలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం లేకుండా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తోంది. నియోజకర్గం, జిల్లా స్థాయిలో భారీ బహిరంగ సభలతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సాధించిన ఘనత, తీసుకు వచ్చిన పథకాలు, వాటి ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలను ప్రజలందరికీ వివరించేలా బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిరంతర పర్యటనలతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బీఆర్ఎస్ క్యాడర్లో జోష్ నిండనున్నది. ప్రతిపక్షాలను చీల్చిచెండాడంలో కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారు. గణాంకాలతో సహా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు గత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి సులువుగా తీసుకెళ్లడంలోనూ కేటీఆర్ ప్రసంగ శైలి ప్రజలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పురపాలక సంఘాల్లో జరిగిన అభివృద్ధి తీరుతెన్నులపై ప్రజలకు అవగాహన కల్పించేలా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా గులాబీ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 9న ఇందూర్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల నేతృత్వంలో జరిగిన కేటీఆర్ సభ విజయవంతమైంది. తాజాగా అదే స్ఫూర్తితో ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభను స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ నిర్వహిస్తున్నారు.
అభివృద్ధితోనే ప్రతిపక్షాలకు జవాబు..
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎల్లారెడ్డి ఒకప్పుడు ఓ పల్లె మాదిరిగా ఉండేది. ఇప్పుడు మున్సిపాలిటీగా మారి సరికొత్త సౌకర్యాలతో ప్రజలకు మేలైన రీతిలో అందుబాటులోకి వచ్చింది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి ఎల్లారెడ్డి అభివృద్ధికి మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారు. తాజాగా కేటీఆర్ పర్యటనతో మరోసారి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా జవాబు ఇస్తాం.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే
కామారెడ్డి సర్వాంగ సుందరంగా మారింది..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక సందర్భంగా కామారెడ్డి పట్టణంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు కామారెడ్డి ఒక పట్టణంగానే పరిమితమై ఉండేది. కేసీఆర్ పాలనలో జిల్లాగా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా మారింది. అనేక పరిపాలన సదుపాయాలు రావడంతోపాటు రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టాం. ఇందుకోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎల్లవేళలా సహకరించారు. జాతీయ రహదారి -44 నుంచి కామారెడ్డి పట్టణంలోకి వచ్చేమార్గంలో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశాం. దీనిని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాం. జిల్లా కేంద్రంలో బీటీ రోడ్ల విస్తరణ, ఇతర కార్యక్రమాలను మంత్రి ప్రారంభిస్తారు.
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే