చినుకు ఆగలేదు.. వాన తగ్గలేదు. నాలుగో రోజూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, గోదావరి, మంజీరా నదులు పోటెత్తుతున్నాయి. కల్యాణి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రెండు గేట్లు ఎత్తి మంజీరాలోకి నీటిని వదులుతున్నారు. పోచారం, సింగీతం, కౌలాస్నాలా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వస్తున్నది. భారీ వర్షాల కారణంగా పదుల సంఖ్యలో పాత ఇండ్లు కూలిపోయాయి. వరద ఉధృతికి రోడ్లు తెగిపోయాయి.
– నమస్తే యంత్రాంగం, జూలై 20
ఏకధాటి వానలతో ఉమ్మడి జిల్లా తడిసి ముద్దవుతున్నది. వారం రోజుల క్రితం మొదలైన వాన ఎడతెరపి లేకుండా కురుస్తుండడంతో అంతటా జలసవ్వడులు కనిపిస్తున్నాయి. ముసురేసిన మొగులు తెరిపివ్వకుండా వర్షాన్ని కురిపిస్తున్నది. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై వరుణుడి దయతో కరువు ఛాయలు నామరూపాల్లేకుండా పోయాయి. ప్రధాన జలాశయాలకు వరద పోటెత్తుతుండగా చెరువుల్లోకి జలప్రవాహం మొదలైంది.
భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. వరదల ధాటికి ఎక్కడికక్కడ రహదారులకు నష్టం వాటిల్లుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా జల ఇబ్బందులు తలెత్తాయి. అతి భారీ వర్షాలు ఉంటాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయా శాఖల అధికారులతో సహాయక చర్యలపై ప్రజాప్రతినిధులు నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత నిరంతరం ఉభయ జిల్లా కలెక్టర్లతో మాట్లాడుతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, షకీల్ అహ్మద్, గణేశ్ గుప్తా నిరంతరం అప్రమత్తంగా ఉన్నారు.
లోటు వర్షపాతం కనుమరుగు..
జూన్ నెల మొత్తం వానల్లేకపోవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే కనిపించింది. కానిప్పుడు లోటు అన్నదే లేకుండా పోయింది. కొన్ని మండలాల్లో ఇప్పటికే అధిక వర్షపాతం నమోదు కాగా అనేక మండలాల్లో సాధారణ వర్షపాతం దాటుకుంటున్నది. వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలకు 17 మండలాల్లో సాధారణ వర్షపాతం దాటుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. నవీపేట, నందిపేట, వర్ని, డిచ్పల్లి, ఇందల్వాయి, డొంకేశ్వర్, మాక్లూర్, రెంజల్, కోటగిరి, సిరికొండ, పోతంగల్, బోధన్, బాల్కొండ, ఆలూర్, చందూర్ వంటి 15 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ సౌత్ మండలం పరిధిలో మాత్రమే లోటు వర్షపాతం కొనసాగుతున్నది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇదే జోరు కనిపిస్తున్నది. మొత్తం 24మండలాల్లో బీర్కూర్, బాన్సువాడ, నాగిరెడ్డిపేట, గాంధారి, సదాశివనగర్, రాజంపేట, భిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట మొత్తం తొమ్మిది మండలాల్లో అత్యధిక వర్షపాతం రికార్డు అయ్యింది. నస్రూల్లాబాద్ మండలంలో అతి భారీ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో లోటు వర్షపాతం కనుమరుగై సాధారణ వర్షపాతం అంచనాలను అందుకోవడం విశేషం. వారం క్రితం వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సగానికి ఎక్కువ మండలాల్లో లోటు వర్షపాతంతోనే కొట్టుమిట్టాడగా ఇప్పుడు ఒకేసారి భారీ వర్షపాతం నమోదు అవుతున్నది.
బడులకు ఆకస్మిక సెలవులు..
భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. పాఠశాలల్లో తరగతులు ప్రారంభమయ్యే సమయానికి ఆకస్మికంగా సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన వెలువరించారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖాధికారులు హుటాహుటిన విద్యాలయాలకు సమాచారం చేరవేయడంతో వచ్చిన విద్యార్థులను వచ్చినట్లే వెనక్కి పంపించారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారీ వానలతో స్కూల్ విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతోపాటు విద్యా సంస్థల్లోనూ అనువైన వాతావరణం ఉండని పరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యేది. సర్కారు నిర్ణయంతో ఉపశమనం దక్కింది. ఉభయ జిల్లాల్లో కొద్దిసేపు జల్లులతో కూడిన వాన, మరికొద్ది సేపు భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తూనే ఉండడంతో గురువారం వరద ప్రభావం పెరిగింది.
ఊరూరా జలసిరి..
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఊరూరా జలకళ ఉట్టిపడుతున్నది. వరదల ప్రవాహం చెరువుల్ని చేరడంతో అలుగు పారుతూ మత్తడి దుంకుతూ సరికొత్త జలశోభ పల్లెల్లో కనిపిస్తున్నది. గొలుసుకట్టు చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువల ద్వారా పలు తటాకాల్లోనూ పూర్తిస్థాయి మట్టానికి జలధారాలు చేరుకున్నాయి. వందల ఎకరాల్లో ఉన్న ఆయకట్టు చెరువులన్నీ దాదాపు నిండుకుండలా మారాయి. పెద్ద చెరువుల్లోనూ మొదట్లో మోస్తారుగానే నీళ్లు వచ్చినప్పటికీ ప్రస్తుతం మత్తడి దుంకే స్థితిలో దర్శనమిస్తున్నాయి. మొన్నటి వరకు చుక్కా నీరు చేరని తటాకాల్లోకి వరద పోటెత్తుతుండడంతో రైతులు, ప్రజలు సంబురం వ్యక్తంచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 1087 చెరువులకు 104 చెరువులు అలుగులు పోస్తున్నాయి. 226 చెరువుల్లో 75-100శాతం నీరు వచ్చి చేరింది. 476 చెరువుల్లోకి 50-75శాతం, 218 చెరువుల్లో 25-50శాతం, 63 చెరువుల్లో 0-25శాతం మేర జలకళ సంతరించుకున్నది. కామారెడ్డి జిల్లాలో 1426 చెరువులకు 92 చెరువులు మత్తడి దుంకుతున్నట్లుగా నీటి పారుదల శాఖ వెల్లడించింది. 101 చెరువుల్లో 75-100శాతం, 249 చెరువుల్లో 50-75శాతం, 506 చెరువుల్లో 25-50శాతం, 478 చెరువుల్లోకి 0-25శాతం మేర వరద వచ్చి చేరింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 196 తటాకాలు పొంగిపొర్లుతుండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
నిండిన చెరువులు, కుంటలు
నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లో వేలాదిగా ఇన్ఫ్లో
కామారెడ్డి, జూలై 20 (నమస్తే తెలంగాణ): మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న ముసురు వానకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం గురువారం సాయంత్రం వరకూ నిరంతరాయంగా కురుస్తూనే ఉన్నది. గురువారం జిల్లా వ్యాప్తంగా సగటు 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పిట్లం మండలం తిమ్మానగర్ సమీపంలో నల్లవాగు నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి. ఎల్లారెడ్డి మండలం భిక్నూర్ శివారులో రోడ్డుపై చెట్టు పడింది. నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండగా, కళ్యాణి గేట్లు ఎత్తివేశారు. కౌలాస్నాలాలోనూ ఇన్ఫ్లో వస్తున్నది.
సదాశివనగర్లో 100 మిల్లీమీటర్లు
జిల్లాలోని సదాశివనగర్ మండలంలో అత్యధికంగా 100.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గాంధారిలో 95.2మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 85.6, కామారెడ్డిలో 78.6, నాగిరెడ్డిపేటలో 81.4, తాడ్వాయిలో 71.8, రాజంపేటలో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా మద్నూర్ మండలంలో 5మి.మీ నమోదుకాగా, జిల్లాలో లోటు వర్షపాతం నుంచి అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. వర్షాలు పుష్కలంగా కురుస్తుండడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో ఇప్పటికే రైతులు నాట్లు వేసుకోగా, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నాట్లు వేస్తున్నారు.
నిండుకుండలా కళ్యాణి ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
ఎల్లారెడ్డి రూరల్, జూలై 20: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కళ్యాణి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్లోకి 650 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్ట్ పూర్తిగా నిండడంతో అధికారులు గురువారం రెండు గేట్లను ఎత్తివేసి 550 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి మళ్లించారు. ప్రాజెక్ట్ ఎగువ భాగంలోని తిమ్మాపూర్ చెరువు, తాటివాని మత్తడి, కళ్యాణి, భవానీపేట్ తదితర ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్ట్ నీటిమట్టం 409.50మీటర్లు కాగా ప్రస్తుతం 408 మీటర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.
పెరుగుతున్న ‘పోచారం’ నీటిమట్టం
ఎల్లారెడ్డి, జూలై 20: భారీ వర్షాలతో పోచారం ప్రాజెక్టు గురువారం సాయంత్రానికి నిండుకుండలా మారింది. కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోని వాగులు, వంకల నుంచి వరద వస్తున్నది. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, లింగంపేట మండలాల నుంచి వచ్చే లింగంపేట పెద్దవాగు నీరు ప్రాజెక్టులో కలుస్తున్నది. కేవలం 233 ఎంసీఎఫ్టీల నీరు ఉన్న ప్రాజెక్టులోకి మూడు రోజుల్లోనే మరో 1600 ఎంసీఎఫ్టీల నీరు వచ్చి చేరింది. శుక్రవారం ఉదయం వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.5 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నదని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 1.8 టీఎంసీలకు చేరుకోగానే ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది.
ఎస్సారెస్పీలోకి 59వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
మెండోరా, జూలై 20: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి 59,165 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ రవి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 20న గురువారం వరకు 15 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. 24 గంటల్లో 3టీఎంసీల నీరు రాగా ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నదన్నారు. బాలేగావ్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేసినట్లు తెలిపారు. గోదావరి తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి మరింత వరద వచ్చే అవకాశమున్నదన్నారు. మహారాష్ట్ర నుంచి ఇన్ఫ్లో రావడం లేదు. ప్రాజెక్టు ప్రధాన కాలువ కాకతీయ కాలువకు 50, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతలకు 430, మిషన్ భగీరథ తాగునీటి కోసం 152 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1073.60 అడుగులు (36.528టీఎంసీలు) నీటి నిల్వ ఉన్నదన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 18.036 టీఎంసీల వరద వచ్చినట్లు పేర్కొన్నారు.
నిజాంసాగర్లోకి భారీగా ఇన్ఫ్లో
పొంగిపోర్లుతున్న నల్లవాగు
కౌలాస్నాలాకు కొనసాగుత్నున్న ఇన్ఫ్లో
నిజాంసాగర్, జూలై 20: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్, సింగీతం, కళ్యాణి, కౌలాస్నాలా ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపిస్తుండగా కుంటలు, చెరువుల అలుగులు పారుతున్నాయి.
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా ఎగువభాగం నుంచి ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రానికి 29,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రాజెక్టులో 1390.43అడుగులు 4.4టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు.
సింగీతం: గాంధారి, పెద్దగుట్ట ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సింగీతం ప్రాజెక్టులోకి 3,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. గురువారం సాయంత్రానికి ప్రాజెక్టులో 416.50 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి 412.00 మీటర్ల వరకు నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ శివకుమార్ తెలిపారు.
కౌలాస్నాలా : జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 458.00మీటర్లు 1.237 టీఎంసీల పూర్తిస్థాయి నీటిమట్టానికి 453.30మీటర్లు 0.860 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఏఈ రవిశంకర్ తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి పొంగిపొర్లుతుండడంతో మంజీర పరవళ్లు తొక్కుతున్నది.