నందిపేట్, అక్టోబర్ 19 : సకల జనులందరూ కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కుటుంబ పాలనపై ప్రియాంక గాంధీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి కవిత మాట్లాడారు. తెలంగాణపై రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు. వారు సత్యదూరమైన అంశాలను మాట్లాడారన్నారు. వారు చెప్పేవి చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను రాహుల్గాంధీ చదువుకున్నారని, ఆయన వైఖరిని మార్చుకోవాలని సూచించారు. రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్గాంధీ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వ్యయం కలిపితే రూ.లక్ష కోట్లలోపే ఉందని తెలిపారు. రూ.లక్ష కోట్ల కన్నా తక్కువ ఖర్చు చేసిన ప్రాజెక్టులో లక్షల కోట్ల అవినీతి ఎలా చేస్తారన్నది ఆలోచించాలని సూచించారు. ఏది పడితే అది మాట్లాడితే ఓట్లు వస్తాయనుకోవడం అమాయకత్వమవుతుందన్నారు.
కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగిందని, ఎస్సారెస్పీ పూర్తి కావడానికి 60 ఏండ్ల సమయం పట్టిందన్నారు. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదలుపెట్టిన ప్రాజెక్టును కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పూర్తి చేసిన పరిస్థితి అని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేకుండా పోరాటం చేసిన కేసీఆర్ మీద అవాకులు చెవాకులు మాట్లాడడం ప్రజలు తట్టుకోలేకపోతున్నారనిన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పారదర్శకంగా కష్టపడి పని చేశాం కాబట్టే పొలాల్లో నీళ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్వి దొంగ,అబద్ధపు వాగ్దానాలని దీనిపై ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. అద్దాల మేడలో కూర్చొని ఇతరులపై రాళ్లు విసరొద్దని, ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపితే మరి భూమికి హక్కుదారులెవరో ఎలా తెలియాలని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా ఎలా రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే ధరణి మాత్రం గ్యారంటీగా గుల్ల అవుతుందన్నారు.
రైతులంటే కాంగ్రెస్కు ఎంత చిన్నచూపో అర్థం చేసుకోవాలన్నారు. అది వాళ్ల తెలంగాణ… వీళ్ల తెలంగాణ అని కూడా మాట్లాడుతున్నారని, ఇది సకల జనులు కలిసి సాధించుకున్న ప్రజాతెలంగాణ అని స్పష్టం చేశారు. సబ్బండ వర్గాల సంతోషం, అభివృద్ధి కోసం ప్రజలంతా కలిసి కాంగ్రెస్ మీదే పోరాటం చేసి తెలంగాణ సాధించుకునామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరుగుతున్నవని అభివర్ణించారు. 2004లో తెలంగాణ ఇస్తామని హామీనిచ్చి పదేండ్ల పాటు నెరవేర్చకపోతే వందలాదిమంది యువకుల బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ కారణమైందన్నారు. అప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇప్పటివరకు తెలంగాణ ఎంతగానో అభివృద్ధి అయ్యేదన్నారు. గుత్ప ఎత్తిపోతల పథకాన్ని రూ.25 కోట్లతో మరమ్మతు చేశామన్నారు. ఫత్తేపూర్ లిఫ్ట్, మాక్లూర్ లిఫ్ట్ ఇలా తదితర వాటికి రూ.350 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.