మోర్తాడ్, జనవరి 23:ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో సత్ఫలితాలను సాధిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీని ఏర్పాటు చేయడం, అందులో ప్రజల అవసరాలకు అనుగుణంగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో 530 నర్సరీల ఏర్పాటుకు ముమ్మర పనులు కొనసాగుతున్నాయి. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 77.62లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంతో నర్సరీల ఏర్పాటు పనులు వేగంగా నిర్వహిస్తున్నారు.
నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం అటవీప్రాంతాల నుంచి నాణ్యమైన మట్టిని తెప్పించి దానిని ఆరబెడతారు. ఆరిన తర్వాత మట్టిని జాలిపట్టి, దానికి సేంద్రియ ఎరువులను కలిపి మొక్కలు పెంచే ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుతారు. ఈ పనులు పూర్తయ్యాక బ్యాగుల్లో ప్రభుత్వం సరాఫరా చేసే వివిధ రకాల మొక్కలను పెంచుతారు. ముఖ్యంగా పూలు, పండ్ల మొక్కలు, ఔషధగుణాలు ఉన్న మొక్కలను పెంచుతారు. అంతకు ముందే గ్రామంలో ఎలాంటి మొక్కలు కావాలో సర్వే నిర్వహించి గ్రామ ప్రజలకు కావాలనుకుంటున్న మొక్కలను పెంచేవారు. ఇప్పుడు కూడా ప్రజలు ఇండ్లలో పెంచుకునే మొక్కలకే ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. గ్రామాల్లో ఏర్పాటవుతున్న నర్సరీల్లో ఆగ్రామానికి కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కల పెంపకాన్ని చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చురుగ్గా నర్సరీల ఏర్పాటు పనులు
మోర్తాడ్ మండలానికి ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా 1.20లక్షల మొక్కలు నాటించాలనేది లక్ష్యం. ఈ మేరకు గ్రామానికి 12వేల మొక్కలు పెంచాలని నిర్ణయించాం. నర్సరీల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మట్టిని సేకరించడం, బ్యాగుల్లో నింపడం, బ్యాగులను పేర్చడంలాంటి పనులు పూర్తవుతున్నాయి. అన్ని నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తికాగానే విత్తనాలు తెప్పించి నాటిస్తాం. ఈసారి కూడా లక్ష్యం మేరకు మొక్కలు నాటించేలా చూస్తాం.
– శ్రీనివాస్రెడ్డి, ఎంపీడీవో, మోర్తాడ్