బాన్సువాడ టౌన్, మార్చి 15: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. టీచర్స్ కాలనీలో మురుగు కాలువ, ఎల్లయ్య చెరువు కట్ట, సంగమేశ్వర కాలనీలను అనుసంధానం చేస్తూ చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఎల్లయ్య చెరువు చుట్టు, చెరువు నుంచి తాడ్కోల్ రోడ్డు వరకు సీసీగా మారుస్తున్నట్లు తెలిపారు. వారాంతపు సంతకు వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ. కోటితో ఈ పనులను చేపట్టినట్లు చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. రజకుల కోసం అత్యాధునిక సౌకార్యాలతో దోభీ ఘాట్ నిర్మించనున్నట్లు స్పీకర్ తెలిపారు. ఈ మేరకు స్థానిక రజకులతో కలిసి దోభీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. స్పీకర్ వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, సరస్వతీ ఆలయ ధర్మకర్త పరిగె శంభురెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎజాస్, గురువినయ్, చాకలి సాయిలు, మున్సిపల్ కమిషనర్ రమేశ్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్ లింగమేశ్వర్, బాన్సువాడ రజక సంఘం సభ్యులు ఉన్నారు.