నందిపేట్, డిసెంబర్ 17 : ఆర్మూర్ మండలంలోని అంకాపూర్లో సమీకృత వెజిటేబుల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. ‘నమస్తే అంకాపూర్’లో భాగంగా ఎమ్మెల్యే జీవన్రెడ్డి శనివారం ఉదయం అంకాపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డికి గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన గ్రామమంతా కలియతిరిగి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. అన్ని వీధుల్లో ప్రజలతో మాట్లాడుతూ సమస్యలేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్.. కూరగాయల ఎగుమతులకు ప్రసిద్ధి చెందిందన్నారు. అంకాపూర్ నుంచి కూరగాయల ఎగుమతులను మరింత ప్రోత్సహించడం కోసం సీఎం కేసీఆర్తో మాట్లాడి త్వరలోనే సమీకృత మార్కెట్ను నిర్మిస్తామని జీవన్రెడ్డి ప్రకటించారు.
అంకాపూర్ అభివృద్ధిపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంకాపూర్కు డబుల్ రోడ్డు ఇప్పటికే మంజూరైందని , త్వరలో తారు రోడ్డు వేసి రూ.1.5 కోట్లతో డివైడర్ నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంకాపూర్ గ్రామంలో గాంధీ చౌరస్తా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి అందంగా ముస్తాబు చేస్తామన్నారు. అంకాపూర్ గ్రామానికి గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన పనులు చాలావరకు పూర్తయ్యాయని, మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని జీవన్రెడ్డి హామీనిచ్చారు. అంకాపూర్లో చేపట్టిన 165 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తుదిదశకు చేరిందని, వచ్చే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ గృహ ప్రవేశాలుంటాయని జీవన్రెడ్డి ప్రకటించారు.
ఆర్మూర్ అభివృద్ధిలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని లేదన్నారు. ఇప్పటికే చరిత్రలోనే లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తు న్నామన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ కిశోర్, ఎంపీటీసీ మహేందర్, పంచాయతీరాజ్ శాఖ ఏఈ నితీష్, నాయకులు ఎంసీ గంగారెడ్డి, నర్సారెడ్డి, యాదవ సంఘం మండల అధ్యక్షుడు భాజన్న, వీ డీసీ సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఉన్నారు.