నందిపేట్, జూన్ 5: వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరణకు కర్త, కర్మ, క్రియ సీఎం కేసీఆరేనని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్హాల్లో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ శ్రమతో నాటి చీకట్లు మాయమయ్యాయని, నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణే నంబర్ వన్ అని అన్నారు. నాడు కరెంటు ఉంటే వార్త, నేడు కరెంటు పోతే వార్త అని, కరెంట్ విజయంతో కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామని వివరించారు.
ఎటు చూసినా వరికోతలు తప్ప విద్యుత్ కోతలు లేవన్నారు. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గానికి రూ. 320 కోట్ల విద్యుత్ సబ్సిడీ వచ్చిందని, మోటర్లకు మీటర్లు పెడుతున్న మోదీ సర్కారుకు మీటర్ బిగిద్దామని, రైతుల రక్తం పీల్చి పిప్పి చేస్తున్న మోదీ ప్రభుత్వం పోవాలన్నారు. తక్కువ వేతనాలతో కాంట్రాక్టర్లతో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 23,667 మంది సర్వీసులను క్రమబద్ధీకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. వ్యవసాయానికి పూర్తిగా ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నదని, చేనేత రంగానికి 50 శాతం సబ్సిడీని ఇస్తున్నదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కోలేదని, అందుకు విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల నిరంతర శ్రమయే కారణమని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీపీలు మాస్త ప్రభాకర్, పస్క నర్సయ్య, జడ్పీ సీఈవో గోవింద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, విద్యుత్ ఉద్యోగులు, రైతులు పాల్గొన్నారు.