మెండోరా/ఆర్మూర్/ఖలీల్వాడి/సిరికొండ, జూలై 28 ;కుండపోత వానలతో ఉమ్మడి జిల్లా గుండె చెరువైంది. ఎడతెగని వర్షాలతో భారీ నష్టం సంభవించింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆపదలో చిక్కుకున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వరద పరిస్థితిని పరిశీలించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి, అర్బన్ నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా విస్తృతంగా పర్యటించారు. సిరికొండ మండలంలో ధ్వంసమైన చెరువులు, వంతెనలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. వరద నీటిలో చిక్కుకున్న బాధితుల వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలు భరోసా కల్పించారు. ఆందోళన అక్కర్లేదని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే.. వర్ష ప్రభావంతో జరిగిన నష్టంపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు.
భారీ వర్షాలు ఉమ్మడి జిల్లాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. వర్షాలు, వరదలను సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల్లో ధైర్యం నింపారు. దెబ్బతిన్న రహదారులు, తెగిన చెరువులు, కూలిన ఇండ్లు, నీట ముగినిన పంటలను క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేశారు. సహయక చర్యలపై సూచనలిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్, నిజామాబాద్, రూరల్ పరిధిలో ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ విస్తృతంగా పర్యటించారు. బాధితులను ఆదుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే జీవన్రెడ్డి సుడిగాలి పర్యటన
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులు, ప్రజలు అధైర్యపడొద్దని, తాను అండగా ఉంటానని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంతో పాటు ఆర్మూర్, ఆలూర్, మాక్లూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు.వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలు, రోడ్లు, చెరువులు, కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద వరదతోపాటు గుండ్ల చెరువు, మల్లారెడ్డి, రెడ్డి చెరువులు, దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను పరిశీలించారు. ఆర్మూర్ మండలం మంథని-పిప్రి రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో మరమ్మతులు చేపట్టి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. ఆలూర్లో చెరువు, దేగాంలో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. వర్షాల కారణంగా వ్యా ధులు ప్రబలకుండా జీవన్రెడ్డి స్వయంగా బ్లీచింగ్ పౌడర్ను చల్లారు. అధికారులు ఎప్పు డు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నందిపేట మండలం ఖుద్వాన్పూర్లో ఓ వృద్ధురాలి ఇల్లు కూలిపోవడం చూసి ఆవేదన చెందారు. వెంటనే గృహలక్ష్మి పథకానికి బాధితురాలిని ఎంపిక చేయాలని ఆదేశించారు. నందిపేట్లో ధ్వంసమైన రోడ్లు, దేవమ్మ ఆలయం వద్ద హైలెవల్ బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలు, ఇండ్ల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపించాలని అధికారులకు సూచించారు. మాక్లూర్ మండలం మానిక్భండార్, బోర్గాం(కే) గ్రామాల్లో జీవన్రెడ్డి పర్యటించి రోడ్డుపై ప్రవహిస్తున్న వరద, దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించారు. ప్రజలు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసానిచ్చారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు.
ప్రజలు ఆందోళన చెందొద్దు.. త్వరలోనే కొత్త వంతెనలు పఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
మండలంలోని కొండాపూర్, తూంపల్లి గ్రామాల్లో వర్షాలకు ధ్వంసమైన చెరువులు, రోడ్లు, కల్వర్టులను ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరిశీలించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని తాము అండగా ఉంటామని అన్నారు. అధికారులు తమకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే నూతన కొత్త వంతెనలను నిర్మించనున్నదని తెలిపారు. ఇంకా అవసరమైన అభివృద్ధి పనులను ప్రభుత్వానికి నివేదించి మంజూరు చేయిస్తానన్నారు. సిరికొండ దొండ్ల వాగు, గడ్కోల్, తూంపల్లి బ్రిడ్జిల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. పంటనష్టంపై రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సిరికొండ నుంచి వేములవాడకు వెళ్లే రోడ్లు, సిరికొండ చెరువు కట్టతెగి ప్రవాహం ఎక్కువ కావడంతో గ్రామంలోకి నీరు వచ్చిందని, మరమ్మతులు చేయిస్తున్నామని తెలిపారు. డిచ్పల్లి, జక్రాన్పల్లి, ఇందల్వాయి, సిరికొండలోని మిగితా గ్రామాల్లో శనివారం పర్యటిస్తానన్నారు. ఆయన వెంట ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు ఉన్నారు.