లింగంపేట/ నాగిరెడ్డిపేట్, మే 8: కంటి వెలుగు కేంద్రాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలు కొనసాగుతున్నాయి. శిబిరాలకు ప్రజలకు స్వచ్ఛందంగా తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కొండ మంజుల సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆమె పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి హిమబిందుతోపాటు కంటి వెలుగు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని ధర్మారెడ్డిలో కంటివెలుగు కేంద్రాన్ని సర్పంచ్ వంజరి సునీత, ఎంపీపీ రాజదాస్, జడ్పీటీసీ మనోహర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురికి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి మందు లు, కంటి అద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రఘు, ఎంపీటీసీ మాధవి, ఎంపీవో శ్రీనివాస్, కో-ఆ ప్షన్ సభ్యుడు షాయద్ పాషా, వార్డు సభ్యులు పాల్గొన్నారు.