నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి దోంచందా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే..దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు.
మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.
చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో బంధువులు యువకుడి మృతదేహంతో శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్స్టేషన్ముట్టడికి యత్నించారు. తాళ్లరాంపూర్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్వాహనంపై కట్టేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
