శక్కర్నగర్/మోర్తాడ్/ఆర్మూర్ టౌన్/సిరికొండ, మే 17: పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలోని పలు మండలాల్లో సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బోధన్ పట్టణంతోపాటు కమ్మర్పల్లి, సిరికొండ మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందన్నారు. 2014 కన్నా ముందు కేవలం 60రూపాయలు ఉన్న పెట్రోల్ ధర నేడు రూ.112కు చేరుకున్నదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మోదీ ప్రభుత్వ తప్పిదంతోనే దేశ ప్రజలపై ధరల భారం పడుతోందన్నారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
బోధన్లో చేపట్టిన కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి బండారు మల్లేశ్ , వివిధ కార్మిక సంఘాల నాయకులు పడాల శంకర్, సీహెచ్ రమేశ్, పీవోడబ్ల్యూ నాయకురాలు బి. నాగమణి, జిల్లా నాయకురాలు బీపాషా బేగం, రెహానా బేగం, సునీత, ఖాజా, బి. శంకర్, సాయిలు, పోశెట్టి, సలీం, గౌస్, బాబు, కమ్మర్పల్లిలో సారా సురేశ్, సత్తెక్క, ఆనంద్, బాలయ్య, సిరికొండలో జిల్లా నాయకుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సీపీఎం కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు ఖాళీ సిలిండర్తో నిరసన చేపట్టారు. నాయకులు కుతాడి ఎల్లయ్య పాల్గొన్నారు.