నస్రుల్లాబాద్, ఫిబ్రవరి 15 : స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు నిరసన సెగ తగిలింది. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాగోస.. బీజేపీ భరోసా కార్యక్రమంలో స్పీకర్ కుటుంబంపై బీజేపీ నాయకుడు మాల్యాద్రి రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధి చూసి ఓర్వలేక.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే మల్యాద్రి రెడ్డి స్పీకర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా అడ్డుకోలేక వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.
మాల్యాద్రి రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గంట పాటు బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. మండల కేంద్రంలో మరోసారి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రామ బీఆర్ఎస్ కార్యకర్తలు మల్యాద్రి రెడ్డిని హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాల వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మాల్యాద్రి రెడ్డి తమ గ్రామం నుంచి వెళ్తేనే తాము వెనుదిరుగుతామని స్పష్టం చేయడంతో మాల్యాద్రి రెడ్డి వెనుదిరిగి వెళ్లారు.