ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
బంజపల్లి, మర్రి తండాలో అటవీ భూముల పరిశీలన
మాచారెడ్డి, మే 28 : అటవీ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మాచారెడ్డి మండలంలోని బంజపల్లి, మర్రితండా గ్రామాల్లో అటవీ భూములను ఎఫ్డీవో శ్రీనివాస్రావుతో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. బంజపల్లి గ్రామంలో గిరిజనులు అటవీభూములను దున్నుతున్నారని ఐదురోజుల క్రితం రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు సీజ్ చేశారు. తాము దున్నిన భూమి అటవీశాఖది కాదని, పట్టా భూమి అని గిరిజనులు ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు ప్రభుత్వ విప్ అటవీ శాఖ, మండల అధికారులతో కలిసి భూములను పరిశీలించారు. పోడు భూముల అంశం ప్రభుత్వ దృష్టిలో ఉన్నదని, అడవులను నరికి పంటలను సాగు చేయవద్దని, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని గిరిజన రైతులకు సూచించారు. విప్ వెంట ఎంపీపీ లోయపల్లి నర్సింగ్రావు, జడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారిణి సుజాత, తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీవో బాలకృష్ణ, ఫారెస్ట్ బీట్ అధికారులు ఉన్నారు.