కోటగిరి, ఫిబ్రవరి 12: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బడుల్లో ప్రతిరోజూ ఉదయం ప్రార్థన విధానంలో మార్పులు వచ్చాయి. విద్యార్థుల గేయాల ఆలాపనతోపాటు పలు మార్పులు చోటుచేసుకున్నాయి. విజ్ఞానంతోపాటు క్రమశిక్షణ, పద్ధతి అలవర్చుకునేలా ప్రార్థన అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వందేమాతరంతో ప్రారంభమైన జాతీయ, రాష్ట్ర గీతాలు, జనగణమన, జయజయహే తెలంగాణ తదుపరి ప్రతిజ్ఞ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సోమ, మంగళవారాల్లో(తెలుగు) బుధ, గురువారాల్లో (హిందీ), శుక్ర, శనివారాల్లో(ఆంగ్లం) ప్రార్థన నిర్వహిస్తున్నారు.
సమాచార స్రవంతి
ప్రతిజ్ఞ ముగియగానే విద్యార్థులు పలు విజ్ఞాన విషయాలు నేర్చుకోవడానికి ప్రార్థన వేదిక ఉపయోగపడుతున్నది. ప్రతిరోజూ ఒక విద్యార్థితో తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన వార్తలు చదివిస్తారు. దీనిలో రెండు అంతర్జాతీయ, రెండు జాతీయ, రాష్ర్టానికి చెందినవి రెండు, జిల్లాకు చెందిన రెండు ముఖ్య విషయాలను చదివిస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం.. సమకాలీన అంశాలపై వారికి అవగాహన కల్పించడం. ప్రధానంగా శాస్త్రవేత్తలు, ఆవిష్కరణలు, ప్రపంచ వింతలు, గ్రంథాలు వాటి రచయితలు, దేశ ప్రముఖులు ఇలా పలు అంశాలపై ప్రశ్నలు ఉంటున్నాయి. నిన్న(కిందటి రోజు) విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు విద్యార్థులే సమాధానాలు చెప్పి అంశాన్ని క్షుణ్ణంగా వివరిస్తారు. దీన్నే నేటి ప్రశ్న.. నిన్నటి జవాబు అని పిలుస్తారు.
చరిత్రలో ఈ రోజు..
చరిత్రలో ప్రతిరోజూ ఒక్క ప్రాముఖ్యత ఉంటుంది. చరిత్రలో జరిగిన సంఘటనలు నుంచి మొదలు జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల జయంతి, వర్ధంతి, ఆవిష్కరణ,ఉద్యమం విశిష్టతలు ఇందులో ఉంటాయి. వీటిని హెచ్ఎంలు, సంబంధిత టీచర్లు విద్యార్థులకు ఆరోజు అంశంపై వివరిస్తారు. ఆ రోజు ఎవరైనా విద్యార్థి పుట్టినరోజు ఉంటే మిగతావారితో శుభాకాంక్షలు తెలియజేస్తారు.
సామెతలు.. సూక్తులు..
ప్రార్థనలో జరిగిన అన్ని విషయాలను పాఠశాల ఆవరణలో ఉన్న నల్లబల్లపై నమోదు చేస్తారు. నిన్నటి ప్రశ్న, నేటి జవాబు చెప్పిన విద్యార్థి పేరు, సూక్తి, సామెత, ఆ రోజు ప్రత్యేకత. ఇలా అన్ని విషయాలను నమోదు చేస్తారు. వీటిని పదేపదే చదవడంతో విద్యార్థుల్లో జిజ్ఞాస పెంపొందే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ప్రైవేటు బడుల్లో కనిపించే ఈ వాతావరణం ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తున్నది. కేవలం తెలుగులో కాకుండా ఆంగ్ల భాషలో విషయాలు చెప్పిస్తూ విజ్ఞానంతోపాటు భాషానైపుణ్యం పెంపొందించేలా పాఠశాల ప్రార్థన తోడ్పడుతున్నది.
కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం..
పాఠశాలలో ప్రతిరోజూ నిర్వహించే ప్రార్థనలో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. సమయపాలన పాటించడంతోపాటు వేదిక మీద మాట్లాడే భయం పోతుంది. కొత్త విషయాలు నేర్చుకుంటున్నామనే భావన కలుగుతున్నది.
-నవనీత, 8వ తరగతి, ఎత్తొండ
ఉత్సాహంగా పాల్గొంటున్నాం
పాఠశాలలో నిర్వహించే ప్రార్థనలో ఉత్సాహంగా పాల్గొంటున్నాం. జాతీయ, రాష్ట్ర గీతాల ఆలాపన, ప్రశ్న- జవాబులతో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.
– నిహారిక, 7వ తరగతి,ఎత్తొండ
భాషా నైపుణ్యం పెరుగుతున్నది..
పత్రికల్లో వచ్చే వార్తలు చదవడం, నమోదు చేయడంతో భాషానైపుణ్యం, పఠనా సామర్థ్యం పెరుగుతుంది. విజ్ఞానాన్ని ఎంతో సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రతిరోజు కొత్త విషయాలు చెప్పడంతో విద్యార్థులకు ప్రార్థన ఎంతో ఉపయోగపడుతున్నది.
-శ్రీనివాసరావు, పాఠశాల హెచ్ఎం,ఎత్తొండ