కామారెడ్డి, జూన్ 2 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతోపాటు చదువుకు దూరమైన పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యంగా విద్యాశాఖ నేటి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఈ నెల 3 నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేశారు. నేటి నుంచి ఈ నెల 10 వరకు ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల రకు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయనున్నారు. గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నారు. ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో పండుగ వాతావరణంలో బడులు తెరవాలని ప్రభుత్వం యోచిస్తుంది. బడిబాట సందర్భంగా ఈ నెల17 వరకు రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 12 నుంచి 19వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 1011 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 697, ప్రాథమికోన్నత 127,ఉన్నత పాఠశాలలు 187 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతుండడంతో విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరే అవకాశం ఉన్నది.
ఈ నెల 3 నుంచి 13 వరకు బడీడు పిల్లలను బడిలో చేర్పిస్తారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు,విద్యా కమిటీ సభ్యులు ర్యాలీలు చేపట్టి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం పాఠశాలల్లోని సదుపాయల గురించి తల్లిదండ్రులకు వివరిస్తారు. 12న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో 13న తొలిమెట్టు, 14న సామూహిక అక్షరాభ్యాసం,15న దివ్యాంగుల బడిబాట, పిల్లల నమోదు, 16న ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం, 17న బాలిక విద్య కేరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పిస్తారు.