ప్రైవేటు బడికి పంపించొద్దని వీడీసీ తీర్మానం
ధర్పల్లి, జూలై 1 : పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించొద్దంటూ వీడీసీ సభ్యుల తీర్మానంతో ఓ స్కూల్ కరస్పాండెంట్ ఆందోళన చెందారు. వారి నిర్ణయం ఇబ్బందిగా మారడంతో వాటర్ట్యాంకు పైకెక్కి నిరసన తెలిపారు. ఈ ఘటన ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని వీడీసీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు.
దీంతో గ్రామంలో ఉన్న శ్రీవిద్య పాఠశాల కరస్పాండెంట్ సాయికృష్ణ వాటర్ట్యాంకు పైకెక్కి ఆత్మహత్య చేసుకుంటానని నిరసన వ్యక్తంచేశాడు. విషయం తెలుసుకున్న ఎస్సై.. గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. వీడీసీ తీర్మానంతో పిల్లలను తమ పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని కరస్పాండెంట్ తెలిపారు. వీడీసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా దిగిరానని మొండికేశాడు. గ్రామస్తులతో చర్చిద్దామని ఆందోళనకారుడిని ఎస్సై సముదాయించి కిందకు రప్పించారు. అనంతరం కరస్పాండెంట్కు వైద్య చికిత్స చేయించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం వీడీసీ సభ్యులు కృషి చేస్తున్నప్పటికీ ఎవరినీ బలవంతం చేయొద్దని ఎస్సై సూచించారు.