ఖలీల్వాడి, జూన్ 19 : జిల్లాలో ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతున్నది. ఫక్తు వ్యాపార ధోరణితో యాజమాన్యాలు వ్యవహరిస్తుండడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందనిద్రాక్షగా మారుతున్నది. ఎంతో కష్టపడి సంపాదించినదంతా పిల్లల చదువుకే ఖర్చవుతుండడంతో పేద, మధ్యతరగతి వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తున్నది. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివించాలంటేనే జంకుతున్నారు. విద్యను వ్యాపారంగా మార్చిన ప్రైవేట్ విద్యా సంస్థలు ఇష్టారీతిన ఫీజులను వసూళ్లు చేస్తున్నాయి. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలనే తల్లిదండ్రుల ఆకాంక్షను తమకు అనుకూలంగా మార్చకుంటున్నారు. పాఠశాల, కళాశాలల్లో ఫీజులకుతోడు యూనిఫాంలు, పుస్తకాలు, నోట్బుక్లు, బస్సు ఫీజులంటూ వసూలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంటే చాలు తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి పిల్లలను చదివిస్తూ అప్పుల పాలవుతున్నారు.
ఫీజులతోపాటు పుస్తకాల రేట్ల పెంపు
గతేడాది కన్నా ఈ విద్యా సంవత్సరం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు 10 నుంచి 30 శాతం వరకు ఫీజులను పెంచాయి. దీనికితోడు పుస్తకాలు, నోటు పుస్తకాల రేట్లు 20 శాతం పెరగడం తల్లిదండ్రులకు అదనపు భారంగా మారింది. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ల కోసం డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించడంలో విఫలమవుతున్నారు. ప్రతి ఏడాది ప్రైవేట్ విద్యాసంస్థలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్లోని ఒక కార్పొరేట్ కళాశాల నిర్వాహకులు వసతులు లేకున్నా భవనాన్ని లీజ్కు తీసుకొని నిర్వహిస్తున్నారు. ఒకటి రెండు ర్యాంక్లు వస్తేనే జిల్లా వ్యాప్తంగా మార్మోగేలా ప్రచారం చేయడం గమనార్హం. ఫెయిల్ అయిన వారి గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించడంలేదు. అసలు ఆ కళాశాలలో ఎంతమంది చదువుతున్నారో తెలియని పరిస్థితి. చదువు చెప్పే అధ్యాపకులకు అర్హత ఉందోలేదో కూడా ఎవరికీ తెలియదు.
వసతుల పేరిట దోపిడీ
ఈ విద్యా సంవత్సరం జిల్లాలో కొత్తగా కళాశాలలు, పాఠశాలలు పుట్టుకువచ్చాయి. అర్హత లేని వారు విద్యా సంస్థలను నడుపుతూ.. నయా దోపిడీకి శ్రీకారం చుడుతున్నారు. తమ వద్ద కొన్ని ప్రత్యేకమైన వసతులు, తరగతులు ఉంటాయని చెబుతూ తల్లిదండ్రుల నుంచి యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తప్పని పరిస్థితిలో ఫీజులను చెల్లిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి తమ పిల్లలను చదివించలేని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఇక్కడే స్థానికంగా ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజులను పెంచేసి దోపిడీకి పాల్పడుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తరగతుల ఫీజులే రూ.50వేల వరకు ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు నోట్ పుస్తకాలు, డ్రెస్సులు, బస్సు ఫీజులతో తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారు.
పాఠశాలల్లోనే పుస్తకాల విక్రయాలు
ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, నోట్పుస్తకాలు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు ఉన్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అడ్మిషన్ తీసుకోగానే తమ పాఠశాలలోనే పుస్తకాలు, డ్రెస్లను విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. హోల్సేల్ రేట్లకు పుస్తకాలు, నోట్పుస్తకాలను కొనుగోలు చేస్తున్న పాఠశాలలు వాటిని ఎమ్మార్పీకి విక్రయిస్తున్నారు.
గత విద్యాసంవత్సరం ఒక్కో తరగతికి రూ. 3 వేల నుంచి 4 వేలు ఉన్న పుస్తకాల ధరలు ఈ విద్యాసంవత్సరం రూ. 6వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగాయి. ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. నోటీసు బోర్డులపై పాఠశాల ఫీజుతో పాటు పరీక్ష ఫీజును ప్రదర్శించాల్సి ఉన్నా అది అమలుకావడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ ఉత్తర్వులు, ఆదేశాలను విద్యాహక్కు చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలలు అమలుచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
అలాంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం
వసతులు లేని పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. అర్హత లేని ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటే నోటీసులు జారీ చేస్తాం. అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వస్తే సదరు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటాం.
-రఘురాజ్, డీఐఈవో
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన అందుబాటులో ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఫీజుల గురించి తల్లిదండ్రులు, విద్యార్థులను కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలి.
-దుర్గాప్రసాద్, డీఈవో