నిజామాబాద్ స్పోర్ట్స్, అక్టోబర్ 13 : ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హెచ్చరించారు. ఏ దశలోనూ ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సం బంధిత అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఆయా శాఖ ల అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు, సీఈవోలు, ఐకేపీ సీసీలతో శుక్రవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులకు గురి కాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. అధికారులు, సిబ్బంది తప్పిదాలతో ఎక్కడైనా రైతులు ఆందోళనకు దిగితే.. సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణించి, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మేరకు ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి, శుభ్రపర్చిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చేలా క్షేత్రస్థాయిలో రైతులను చైతన్యపర్చాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ధాన్యం రవాణాకు సరిపడా వాహనాలను సమకూర్చుకోవాలని, ధాన్యం ఎగుమతులు, దిగుమతులు వెంటనే జరిగేలా అవసరమైన సంఖ్యలో హమాలీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున కొనుగోలు కేంద్రాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో ప్రారంభోత్సవాలు చేయించకూడదని, అధికారులే ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. ఫ్లెక్సీలలో కూడా ఫొటోలు ఉండకూడదని, కేవలం రైతులకు ఉపయోగపడే సూచనలు మాత్రమే ముద్రించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాణ్యతా ప్రమాణాలను సాకుగా చేసుకొని రైతులను నష్టపర్చే ప్రయత్నాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమన్నారు. సమావేశంలో డీఎస్వో చంద్రప్రకాశ్, డీసీవో సింహాచలం, జిల్లా వ్యవసాయాధికారి వాజిద్ హుస్సేన్, డీఆర్డీవో చందర్ పాల్గొన్నారు.