ఖలీల్వాడి, మార్చి 14: ఇంటర్ పరీక్షలు అయిపోయాయి. ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టిన ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆనందంతో ఇంటికి వెళ్లారు. ఫస్టియర్ వారు ఇలా వెళ్లారో, లేదో కళాశాలల నుంచి పిలుపు వచ్చింది. సెకండియర్ తరగుతులు ప్రారంభిస్తున్నామని, తిరిగి రావాల్సిందేనని ప్రైవేట్ కాలేజీల నుంచి సమాచారమందింది. పైగా వచ్చేటప్పుడు 50 శాతం ఫీజు కూడా తీసుకురావాలని ప్రైవేట్ కళాశాలలు హుకూం జారీ చేశాయి. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇంటికి వచ్చి మూడు రోజులు కూడా కాక ముందే కళాశాలకు రమ్మనడంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడమే కాకుండా 50 శాతం ఫీజులు చెల్లించాలనడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
వారమైనా కాలే..
ఇంటర్ వార్షిక పరీక్షలు రెండ్రోజుల క్రితమే అయిపోయాయి. ఫస్టియర్ విద్యార్థులకు గురువారంతో, సెకండియర్ విద్యార్థులకు శుక్రవారంతో ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఇన్నాళ్లు పుస్తకాల్లో నిమగ్నమైన విద్యార్థులు సంతోషంగా ఇంటికి వెళ్లారు. ఇక సమ్మర్ హాలీడేస్ను జాలీగా గడిపేయొచ్చని భావించారు. టూర్లు, షికార్లకు ప్రణాళికలు వేసుకుంటున్న ఫస్టియర్ విద్యార్థులకు ప్రైవేట్ కాలేజీలు ఊహించని రీతిలో షాక్ ఇచ్చాయి. వచ్చే వారం నుంచి సెకండియర్ తరగతులు ప్రారంభించనున్నట్లు సందేశాలు పంపించాయి. తప్పనిసరిగా రావాలని, వచ్చేటప్పుడు 50 శాతం ఫీజు తీసుకురావాలని హుకూం జారీ చేశాయి. కాలేజీల నుంచి మెస్సేజ్లు చూసి కంగుతినడం విద్యార్థులు, తల్లిదండ్రుల వంతైంది.
పర్యవేక్షణ కరువు
జిల్లాలోని పలు ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నెల 23 నుంచి సెకండియర్ పాఠ్యాంశాలు బోధించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ మేరకు ఫస్టియర్ విద్యార్థులకు సమాచారం పంపించాయి. వాస్తవానికి జూన్ మాసంలో తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా, ముందస్తుగా సిలబస్ పూర్తి చేయాలన్న తలంపుతో మార్చి నుంచే పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రైవేట్ కాలేజీలు సిద్ధమయ్యాయి. మరోవైపు, కళాశాలలను కట్టడి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తున్నది. మండుటెండల్లో క్లాసులు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై పడే మానసిక ఒత్తిడి గురించి అటు కళాశాలలు, ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు, తరగతులు నిర్వహించే ప్రైవేట్ కళాశాలలను కట్టడి చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నాయి.
ప్రైవేట్ కళాశాలల ఇష్టారాజ్యం
నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. మండుటెండల్లో తరగతులు నిర్వహిస్తే, విద్యార్థులకు ఏమైనా అయితే ఎవరిది బాధ్యత. జూన్లో ప్రారంభించాల్సిన తరగతులు మార్చిలోనే ప్రారంభిస్తుంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు? వేసవి సెలవుల్లో ప్రైవేట్ కళాశాలలపై కన్నేసి ఉంచాలి. క్లాసులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ రాజశేఖర్, ఏఐఎఫ్డీఎఫ్ జాతీయ కన్వీనర్
ఫిర్యాదు చేస్తే చర్యలు
కళాశాలలు సెకండియర్ తరగతులు ప్రారంభిస్తున్నట్లు మాకు సమాచారం లేదు. అలా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా ఎవరైనా ఫిర్యాదు చేస్తే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు కచ్చితంగా వేసవి సెలవులు ఇవ్వాలి. కానీ, సమ్మర్ హాలీడేస్లోనూ క్లాసులు నిర్వహిస్తే మాత్రం చర్యలు తప్పవు.
– రవికుమార్, జిల్లా ఇంటర్ విద్యాధికారి
వేసవి సెలవుల్లో క్లాసులా?
ప్రైవేట్ కళాశాలలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహించేందుకు సిద్ధ మవుతు న్నాయి. పైగా తరగతులు ప్రారంభం కాక ముందే ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా? అధికారుల పర్యవేక్షణ ఉండదా? ఫిర్యాదు చేస్తే కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తాయన్న విషయం అధికారులకు తెలియదా?. వేసవిలో తరగతులు నిర్వహించకుండా అధికారులు చర్యలు చేపట్టాలి.
– అభిలాశ్రెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు