ASHA Workers | ఎడపల్లి : చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆశ వర్కర్లు హైదరాబాద్కు తరలివెళ్తుండగా ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆశ వర్కర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రాజమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గత శాసనసభ ఎన్నికల సమయంలో ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
కనీస వేతనం అందజేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. తక్కువ పారితోషికంతో ఎక్కువ పని చేయించుకోవడం అన్యాయమని, ఆశ వర్కర్లకు తక్షణమే గౌరవప్రదమైన కనీస వేతనాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.