నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 3 : రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అర్హులకు అందజేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో అధికారులు, సిబ్బంది ప్రజల నుంచి బుధవారం దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 6వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సిరికొండ మండలంలోని తాటిపల్లి, చీమన్పల్లి, కొండాపూర్, తూంపల్లి గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణను అదనపు కలెక్టర్ యాదిరెడ్డి పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. చందూర్లో దరఖాస్తుల స్వీకరణను బాన్సువాడ నియోజకవర్గ నోడల్ అధికారి కొండల సింహాచలం పరిశీలించారు. దరఖాస్తు ఫారాల కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘాన్ని పరిశీలించారు. రెంజల్ మండలం సాటాపూర్లో ప్రజాపాలన దరఖాస్తులను అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్నాయక్ పరిశీలించారు. బోధన్ మండలం బెల్లాల్లో కొనసాగుతన్న ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ పరిశీలించారు. బోధన్లో కొనసాగుతున్న ప్రజాపాలన కేంద్రాలను మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్ పరిశీలించారు.