బోధన్, నవంబర్ 18: బోధన్ నియోజకవర్గంలోని సాటాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు వచ్చిన మంత్రి హరీశ్రావు ప్రసంగం ఆద్యంతం సభికులను ఆకుట్టకుంది. హరీశ్రావు ప్రసంగంతో పాటు.. సభకు బోధన్ నియోజకవర్గంలోని రెంజల్, నవీపేట్, ఎడపల్లి మండలాల నుంచి వేలాది మంది జనం తరలిరావడం.. గులాబీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నింపింది. సభలో మంత్రి ప్రసంగానికి జనం నుంచి స్పందన కనిపించింది. సాటాపూర్లోని ఇస్తేమా మైదానంలో శనివారం నిర్వహించిన బహిరగసభకు ఊహించని రీతిలో జనం రావడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎటువంటి దుస్థితి దాపురిస్తుందన్న విషయాలను ప్రజలకు మంత్రి వివరించారు. ప్రధానంగా బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కృషితో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల వివరాలు, ఆ పనులకు ఎంత ఖర్చుతో చేశారో వివరించారు. మరింత అభివృద్ధి జరగాలంటే.. షకీల్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. సామాన్యులకు సైతం అర్థమయ్యేలా హరీశ్రావు ప్రసంగం ఉండటంతో సభకు వచ్చిన జనం మండుటెండలో సైతం ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఇటీవల బోధన్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్న కులసంఘాల గర్జన సభతోపాటు సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమయ్యాయి. ఈ హరీశ్రావు సభ కూడా విజయవంతం కావడంతో ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. జనం నుంచి స్పందన చూస్తుంటే బీఆర్ఎస్ అభ్యర్థి షకల్ గెలుపు ఖాయమైనట్లేనని పలువురు అంటున్నారు.
ఈ ఎన్నికల్లో బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ హ్యాట్రిక్ కొడుతారని, షకీల్కు వచ్చే సర్కార్లో ప్రమోషన్ లభిస్తుందని, పెద్ద పదవిలో ఆయన ఉంటారని ప్రజా ఆశీర్వాద సభలో రాష్ట్ర మంత్రి హరీశ్రావు ప్రకటించడం నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. ఈ మాటలను మంత్రి చెబుతున్నప్పుడు సభలోని జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సభ ప్రారంభంలో ఆష్ట గంగాధర్ కళాబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి.
బహిరంగసభలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామకిషన్రావు, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఏ.రజాక్, బీఆర్ఎస్ రెంజల్, నవీపేట్ మండలాల అధ్యక్షులు భూమ్రెడ్డి, నర్సింగ్రావు, ఇటీవల వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామాలు చేసి బీఆర్ఎస్లో చేరిన గౌతమ్ప్రసాద్, సత్యవతి దంపతులు, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ శంకర్, మౌలానా, వికార్ పాషా, ఏటీఎస్ శ్రీనివాస్, ఖదీర్ ఖాన్, రఫీయోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.