దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి కేసీఆర్ సర్కారు సాంత్వన చేకూరుస్తున్నది. జీవిత చరమాంకంలో వివిధ రుగ్మతలతో సతమతమవుతున్న బాధితులకు మేమున్నామని భరోసానిస్తున్నది. క్యాన్సర్, ఎయిడ్స్, పక్షవాతం, డయాబెటిక్తో పాటు కిడ్నీ సమస్యలు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకుంటున్నది. ఇందుకోసం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా దవాఖానల్లో పాలియేటివ్ కేర్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నయం కాని రోగాల బారిన పడిన బాధితులకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగానే అందిస్తున్నది. రోగులను సొంత మనుషుల్లా చూసుకుంటున్న వైద్య సిబ్బంది.. అవసరమైన వారికి ఇంటికే వచ్చి చికిత్స (హోం కేర్) చేస్తున్నారు. స్పెషలిస్ట్ డాక్టర్లతో పాటు నర్సులు, సోషల్ వర్కర్లు అందుబాటులో ఉంటూ రోగులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారు.
విద్యానగర్/ఖలీల్వాడి, జనవరి 10 : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ జీవిత చరమాంకంలో ఉన్న రోగులను అక్కున చేర్చుకుంటూ వారికి కావలసిన సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాలియేటివ్ కేర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మానసికంగా కుంగిపోయిన రోగులకు మానసిక ధైర్యం నింపుతున్నది. పాలియేటివ్ కేర్ అనేది ఒక ఇంటర్ డిసిప్లినరీ వైద్య విధానం. ఇది జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది. నయం కానీ దీర్ఘకాలిక రోగాల బారిన పడిన రోగులకు ఓపీ, ఐపీ, హోంకేర్ సేవలు అందిస్తుంది. పాలియేటీవ్ కేర్ అనేది సంరక్షణే ప్రధాన లక్ష్యంగా లేదా నివారణ చికిత్సతో పాటుగా అందించబడుతుంది. వైద్యులు, నర్సులు, ఆక్యుపేషనల్, ఫిజికల్ థెరపిస్ట్లు, సైకాలజిస్ట్లు, సోషల్ వర్కర్లు, చాప్లిన్లు, డైటీషియన్లను కలిగి ఉండే ఇంటర్ డిసిప్లినరీ టీం ద్వారా అందించబడుతుంది. తీవ్రమైన అస్వస్థత ఉన్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడం. క్యాన్సర్ బారిన పడి చివరి దశలో ఇంటి వారే దూరం చేసే పరిస్ధితిలో ప్రభుత్వం వారికి ఉచిత సేవలు అందిస్తూ మంచి పౌషకాహారం అందిస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కామారెడ్డి జిల్లాలో 2021లో ఏర్పాటు…
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో 2021 ఆగస్టు 12వ తేదీన ఆరు పడకలతో పాలియేటివ్ కేర్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రం చుట్టూ క్యాన్సర్, హెచ్ఐవీ, షుగర్, కిడ్నీ, పక్షవాతం ఇతర రోగాలతో బాధపడుతూ మంచానికే పరిమితమైన నిరుపేదలకు, అనాథలకు ఉచితంగా సేవలు అందిస్తున్నది. పాలియేటివ్ కేర్ విభాగంలో ఒక ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్స్, సాధారణ వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, హోం కేర్ సేవలందించేందుకు 108 లేదా ఏదైన వాహనం అందుబాటులో ఉంటుంది. దవాఖానకు వచ్చే రోగులతో పాటు హోం కేర్ ద్వారా ఇండ్ల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 155 మందికి పైగా అడ్మిట్ అయి వైద్య సేవలు అందుకున్నారు. ఓపీ ద్వారా 242 మందికి సేవలు అందించారు. హోం కేర్ ద్వారా ఆయా పీహెచ్సీ ఫిజియోథెరపి, ఒక స్టాఫ్ నర్స్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి సుమారు 4,813 మందికి సేవలు అందించారు. ప్రతి రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. మూడు పూటల గుడ్లు అందిస్తారు. పౌష్టికాహారంతో కూడి ప్రొటీన్ ఫుడ్ను అందిస్తారు. ఘన పదార్థం తినని వారికి జావ రూపంలో ఆహారాన్ని అందిస్తారు. పండ్లు, మజ్జిగ, పాలు ప్రతి రోజు అందిస్తారు. వార్డులో ఎప్పటికప్పుడు వైద్యుల పర్యవేక్షణ, పరిశుభ్రంగా కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలను కల్పిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 2022లో ..
నిజామాబాద్ జిల్లాలో జూన్ 18, 2022లో పాలియేటివ్ కేర్ యూనిట్ను ప్రారంభించారు. ఇందులో మొత్తం 16 బెడ్లు ఉన్నాయి.రోగితో పాటు వెంట వచ్చే మరొకరికి బెడ్ సౌకర్యం కల్పించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఓపీ ద్వారా 124 మందికి, ఐపీ రోగులు 80 మందికి ఉచిత చికిత్స అందిస్తూ పౌష్ఠికాహారం అందిస్తున్నారు. హోమ్ కేర్ ద్వారా 661 మందికి సేవలుఅందించారు.
గుర్తించడం ఎలా..
ముందుగా పాలియేటివ్ సభ్యులు పీహెచ్సీ, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం అందించి వారి ప్రాంతంలో క్యాన్సర్కు గురి అయిన వ్యక్తులు ఉంటే వారి వివరాలను తెలుసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా చికిత్స చేయిస్తారు. వారి కోరిక మేరకు పాలియేటివ్ కేర్కి తీసువచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉచితంగా చికిత్స అందిస్తూనే పౌష్టికాహారం అందిస్తారు.
పేదలకు వరంగా పాలియేటీవ్ కేర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలియేటివ్ కేర్ యూనిట్లు పేదలకు వరంగా మారాయి. చివరి క్షణంలో బాధపడే రోగులకు ఈ పాలియేటివ్ కేర్ ద్వారా కొంత వరకు ఉపశమనం కలుగుతుంది.రోగులకు అన్ని రకాల సౌకర్యాలతో మంచి పోషకాహారాన్ని అందిస్తున్నాం.
– డాక్టర్ విజయలక్ష్మి , కామారెడ్డి జిల్లా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్
ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తున్నది. ఎప్పడు ఏదో ఒక కొత్త పథకం తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నది. పాలియేటివ్ కేర్ యూనిట్ ద్వారా వైద్య సేవలు పొందుతున్న క్యాన్సర్ బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– ప్రతిమారాజ్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్, నిజామాబాద్.
సీఎం కేసీఆర్ ఇచ్చిన వరం
క్యాన్సర్ రోగం వస్తే చనిపోవడమే అనుకున్న మాకు పాలియేటివ్ కేర్ అనేది మాకు కేసీఆర్ ఇచ్చిన వరం. ఈ చికిత్సను ప్రైవేట్ దవాఖానలో చేసుకోవాలంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడి ప్రభుత్వం అన్ని రకాలు చికిత్సలు అందిస్తూ మంచి ఆహారాన్ని అందిస్తున్నది. ఎలాంటి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంటి మనుషుల్లా చూసుకుంటున్నారు.
– రాజవ్వ, గుర్జాల, గాంధారి మండలం
వైద్య సేవలు బాగున్నాయి
నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. మొదట హైదరాబాద్ వెళ్లాలని అనుకున్నా కానీ ఇక్కడి సేవలు తెలుసుకొని ఇక్కడే అడ్మిట్ అయ్యాను.ఇక్కడ చికిత్స చాలా మంచిగా ఉన్నది. మంచి భోజనం పెడుతూ చాలా కేర్ తీసుకుంటున్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇంట్లో ఉండి చికిత్స చేసుకున్నట్టుంది.
– మెయినుద్దీన్, నిజామాబాద్
రోగులకు సేవలు అందిచడమే మా లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలియేటివ్ కేర్ యూనిట్ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి ఆలోచన క్యాన్సర్ రోగులకు వరంలా మారింది. వారికి చికిత్సతో పాటు పౌష్టికాహారం అందించడమే కాకుండా వారిలో మనోధైర్యం నింపుతున్నాం.
– డాక్టర్ చైతన్య, పాలియేటీవ్ కేర్ యూనిట్, నిజామాబాద్.