బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 4 : గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే పోడు పట్టాలను అందించనున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్దాని తండా గ్రామంలో చేపట్టనున్న జగదాంబదేవి, సేవాలాల్ ఆలయ ప్రహరీ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భోగ్భండార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. 2005లో జక్కల్దాని తండా వాసులకు 26 ఎకరాల భూమిని పంపిణీ చేశామని తెలిపారు.
రాష్ట్రంలోఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో గిరిజనులకు 2500 డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చామని, త్వరలో 583 మందికి 1200 ఎకరాలకు సంబంధించిన పోడు పట్టాలను అందిస్తామన్నారు. సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అనంతరం గ్రామంలో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఆలయ ప్రహరీ నిర్మాణానికి రూ.10లక్షలతోపాటు సీసీ రోడ్లకు రూ. 10లక్షలు, పాఠశాల ప్రహరీకి రూ. 3లక్షలు, డ్రైనేజీలకు రూ.7లక్షలు, కమ్యూనిటీ హాల్కు రూ. 10లక్షలు, అంగన్వాడీ భవనానికి రూ. 6లక్షలు, డిస్ట్రిబ్యూటరీ కాలువకట్టలపై గ్రావెల్ కోసం రూ. 4లక్షలు మంజూరు చేశారు.
పనులను త్వరగా చేపట్టి పూర్తి చేయించాలని సర్పంచ్ సంగ్యానాయక్కు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాజాగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, దొడ్ల వెంకట్రాంరెడ్డి, గోపాల్రెడ్డి, తండా పెద్దలు జెమ్లానాయక్, బన్సీనాయక్, రతన్, మోహన్, జగ్రాం, రాకేశ్, ప్రేమ్సింగ్, బన్సీ తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో శాసన సభాపతి
నస్రుల్లాబాద్, ఏప్రిల్ 4 : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మండలంలోని దుర్కి గ్రామంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిములకు పండ్లు తినిపించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. ఇటీవల మృతిచెందిన మాజీ సర్పంచ్ భాగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మాజిద్, సర్పంచ్ శ్యామల, విండో చైర్మన్ దివిటి శ్రీనివాస్, ఎంపీటీసీ నారాయణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు వాజిద్, ఉపసర్పంచ్ ఖదీర్, నాయకులు మహేశ్, మోహన్, నారాగౌడ్, గిర్మయ్య పాల్గొన్నారు.