రుద్రూర్/వర్ని, నవంబర్ 22 : ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏనుగు రవీందర్రెడ్డి చేసిన అవినీతి అంతా ఇంతా కాదని, అలాంటి నాయకుడిని ఆదరిస్తే మోసపోయి గోస పడుతం అని బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివారెడ్డి అన్నారు. బొప్పాపూర్ గ్రామంలో పోచారానికి మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో ఘన స్వాగతం పలికా రు. తామంతా మీవెంటే ఉంటామని మహిళలు పోచారం శ్రీనివాసరెడ్డికి మాటిచ్చారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూ ర్, రుద్రూర్ గ్రామాల్లో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు బొప్పాపూర్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అనంతరం రుద్రూర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పోచారానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు బైక్ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ పోచారం మాట్లాడుతూ..
నేను లోకల్ ఎప్పటికి మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు నేను అభివృద్ధి చేశానని నమ్మితేనే మీరు ఓటు వేయండి.. చేసిన అభివృద్ధిలో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఇక నుంచి ప్రతి ఒక్కరూ నేరుగా తనవద్దకు వచ్చి అడగవచ్చని అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే నాలాంటి నాయకుడు కావాలా? లేదంటే పనులు కావాలంటే ఎల్లారెడ్డి, నిజామాబాద్ వెళ్లి చెప్పే పరిస్థితిలో ఉన్న నాయకుడు కావాలా? అని అన్నారు. ఇప్పటి వరకు రుద్రూర్ మండలంలో సుమారు రూ.37కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. మీరంతా ఆశీర్వదిస్తే నేను మీ తరఫున రెట్టింపు ఉత్సాహంతో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ముదిరాజ్, మున్నూరు కాపు, వంజరి, దర్జీ సంఘాలు పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఏక గ్రీవ తీర్మానాలు అంద జేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, వైస్ ఎంపీపీ సాయిలు, పార్టీ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మన్, కార్యదర్శి బాలరాజు, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, సర్పంచ్ బాపూజీ సావిత్రిలింగం, పార్టీ గ్రామ అధ్యక్షుడు తొట్ల గంగారాం, వివిధ గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు ఉన్నారు.
వర్ని, నవంబర్ 22 : ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండల కేంద్రం సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాస కాలనీ, వడ్డేపల్లి, సేవాలాల్ తండా, కోటయ్య క్యాంపు ప్రాంతాల్లో బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఐదు వందల ద్విచక్ర వాహనాలతో ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీనివాస కాలనీలో మహిళలు మంగళహారతులు ఇస్తూ, పూలు చల్లుతూ స్వాగతం పలికారు. వడ్డేపల్లిలో కాలనీ వాసుల కోరిక మేరకు ఆయన హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది రూపాయలు వెచ్చించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే.. ఎలాంటి అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, సీసీ రోడ్లు, ప్రభుత్వ దవాఖానలు, ఇతర అభివృద్ధి పనులు ఏనుగుకు కనబడడం లేదని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం రవీందర్ రెడ్డి, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, కో ఆప్షన్ సభ్యుడు కరీం తదితరులు పాల్గొన్నారు.
కోటగిరి, నవంబర్ 22 : బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కొత్తపల్లి గ్రామ బీఆర్ఎస్ శ్రేణులు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అనంతరం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న చోటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
మోస్రా (చందూర్), నవంబర్ 22 : చందూర్కు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి చిన్ననాటి స్నేహితుడు దుర్కి పోశెట్టి పోచారానికి మద్దతుగా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్నేహితుడు ఎన్నో మైలు రాళ్లు దాటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడన్నారు. పోచారం చేసిన అభివృద్ధి పనులు కండ్లకు కనబడుతుంటే ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియని నాయకులు బాన్సువాడను ఏలు దాం అంటూ వస్తున్నారని, ప్రజలు ఎలా నమ్ముతారని వారికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నాను.
ఏనుగును ఆదరిస్తే నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టిస్తాడు
– ఎల్లారెడ్డి నియోజకవర్గ దళితులు