కామారెడ్డి, మే 31 : రెడ్డిల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాసంపల్లి శివారులో రాజాబహదూర్ వెంకట్ రామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో రెడ్డి, ఇతర విద్యార్థుల కోసం రెడ్డి హాస్టల్, విద్యాలయం, సంక్షేమ భవన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్తో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. రెడ్డి సామాజికవర్గంలో కూడా పేదవారు ఉన్నారని అన్నారు. వారి సంక్షేమంతో పాటు ఇతర సామాజిక వర్గాల కోసం రాజాబహదూర్ విద్యా పరిషత్ ట్రస్ట్ భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్డి కులస్తులు అగ్రస్థానంలో ఉన్నారని చెప్పారు. ఈ స్థలం కేటాయింపునకు సహకరించిన విప్ గంప గోవర్ధన్కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ ట్రస్ట్కు అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేయించడానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏండ్లలో ఎంతో మంది రెడ్డి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చారు కానీ.. రెడ్డి సామాజికవర్గానికి మేలు ఏమీ చేయలేదన్నారు. అగ్రవర్ణంలోకి పేద విద్యార్థులకు మంచి చేసేందుకు భవన నిర్మాణం చేపడుతున్నందుకు జిల్లాలోని రెడ్డి కులస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ రెడ్డి సామాజికవర్గానికి కృషిచేస్తున్నారన్నారు. ఒక గ్రామంలో రెడ్డి బాగుంటే అందరూ బాగుంటారని సీఎం కేసీఆర్ విశ్వసిస్తారని తెలిపారు. రాజా బహదూర్ వెంకటరాంరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్లో రూ. 150 కోట్ల విలువలైన 15 ఎకరాల భూమిని ఇవ్వడంతోపాటు భవన నిర్మాణం కోసం రూ. 10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్డిలే అగ్రస్థానంలో ఉన్నారని, ఈ విషయమై వారు ఆలోచన చేయాలని అన్నారు.
ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. ఈ ట్రస్టు ద్వారా పేదరెడ్డి సామాజిక వర్గానికే కాకుండా ఇతర వర్గాలకు హాస్టల్ వసతి, విద్యాలయం, సంక్షేమ భవనం ద్వారా సేవలు అందనుండడం శుభపరిణామమన్నారు. ఎంపీ బీబీపాటిల్ మాట్లాడుతూ.. భవన నిర్మాణానికి తన వంతుగా రూ. 11 లక్షల విరాళం అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు నాగర్తి చంద్రారెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఏనుగు సంతోష్రెడ్డి, విద్యాదాత సుభాష్రెడ్డి, జూకంటి ప్రభాకర్రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, ట్రస్ట్ వైస్ చైర్మన్ గడ్డం రమేశ్ రెడ్డి, కొప్పుల గంగారెడ్డి, ప్రధానకార్యదర్శి రాజకుమార్రెడ్డి, కోశాధికారి ఏలేటి రాంరెడ్డి, సభ్యులు పన్యాల రామ్మోహన్ రెడ్డి, కొలిమి భీంరెడ్డి, బాణాల మల్లారెడ్డి, సంతోష్ రెడ్డి, రెడ్డి సంఘ సభ్యులు పాల్గొన్నారు.