రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదన్నారు. బాన్సువాడలో బుధవారం అధికారికంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు.
బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రజలు అన్ని మతాల పండుగలను కలిసిమెలిసి జరుపుకొంటారని, తెలంగాణ.. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణ పరిధిలోని పీఎస్ఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో బుధవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ముస్లింలకు పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ముస్లిములు చేసే కఠోర ఉపవాసం, పవిత్ర ప్రార్థనలతో అందరికీ మంచి జరుగాలని ఆకాంక్షించారు. అనంతరం పేద కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా కన్వీనర్ దుద్దాల అంజిరెడ్డి, బాన్సువాడ సోసైటీ చైర్మన్ ఏర్వాల క్రిష్ణారెడ్డి, నాయకులు ఎజాజ్, గోపాల్రెడ్డి, వాహబ్, స్థానిక ముల్లా మౌలానా, షాబీర్, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.