నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 8: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం వద్ద ఉన్న రాజారాం స్టేడియంలో సీపీ కేఆర్ నాగరాజు ఈవెంట్స్ను ప్రారంభించారు. తొలిరోజు పురుష అభ్యర్థులకు అవకాశం కల్పించగా, ఉదయం 5 నుంచి సాయంత్రం వరకు పరీక్షలు కొనసాగాయి. గురువారం 600 మంది అభ్యర్థులకు 518 మంది హాజరయ్యారు. పరీక్షల్లో మానవ ప్రమేయం లేకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్ ప్యాడ్లను ఉపయోగించారు.
అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తోపాటు 1600 మీటర్ల పరుగుపందెం నిర్వహించారు. ఎత్తు, కొలత నిర్వహించగా అర్హత సాధించిన అభ్యర్థులకు కొంతసమయం విశ్రాంతినిచ్చి ఈవెంట్స్ చేపట్టారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తాగునీరు, వైద్య బృందం, అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. పరీక్షలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని సీపీ కేఆర్ నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కిరణ్ కుమార్, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.