ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కేసీఆర్.. కేవలం ఆరు నెలల్లోనే విద్యుత్ కోతల్లేని తెలంగాణాగా తీర్చిదిద్దారు. ఆంధ్రపాలకులు విద్యుత్ సంక్షోభం సృష్టిస్తున్నా ఏ మాత్రం వెరవని సీఎం కేసీఆర్.. విద్యుత్ ఉత్పాదకతపై దృష్టి సారించి వ్యవసాయానికి నిరంతరం విద్యుత్ సరఫరా చేసి దేశమే అబ్బురపోయేలా చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కేసీఆర్ను మించిన వ్యక్తి లేడని చాటిచెప్పారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు అధికారం కట్టబెడితే.. మూడు నెలల్లోనే కరెంటు కోతలు విధిస్తూ షాక్నిచ్చింది. ఈ వార్తలను చూస్తున్న తెలంగాణ ప్రజానీకం.. రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెసోళ్లు చెప్పే మాటలను నమ్మకూడదని, నమ్మి కర్ణాటక ప్రజల మాదిరిగా మోసపోకూడదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సీఎం కేసీఆర్తోనే వెలుగుల తెలంగాణ అవతరించిందని, అలాంటి నాయకుడినే మళ్లీ సీఎం చేస్తామని స్పష్టంచేస్తున్నారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 19
జనానికి మేలు చేయాలనే సంకల్పం లేని.. అధికారమే యావగా ఉండే నాయకులను ఎన్నుకుంటే కర్ణాటక ప్రజల పరిస్థితే ఎదురవుతుందంటూ తెలంగాణవాసులు అభిప్రాయపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. ఉచితంగా కరెంటు ఇస్తామంటూ బీరాలు పలికారు.. అధికారంలోకి వచ్చి ముచ్చటగా మూడు నెలలు కూడా కాలేదు కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న దృశ్యాలు ఆలోచింపజేస్తున్నాయి. కర్ణాటకలో సామాన్యులు, రైతుల నుంచి మొదలుకొని పరిశ్రమలు సైతం బంద్చేసే పరిస్థితిని టీవీల్లో చూస్తూ విస్మయానికి గురవుతున్నారు. తెలంగాణలో ఆ బాధలు లేవని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే సీఎం కేసీఆర్ ఉండగా కరెంటు ఇబ్బందులు ఉండవని స్పష్టంచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్రం వస్తే ఎలా పాలన ఉంటుందో ముందుగానే చెప్పి… చెప్పినదానికన్నా ఎక్కువే చేశారని కొనియాడుతున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆరు నెలల్లో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెబుతున్నారు. రాష్ట్రం విడిపోతే చిమ్మచీకట్లే గతి అన్న నోళ్లకు తాళం వేశాడని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే కండ్లలో నిప్పులు పోసుకుంటున్న కాంగ్రెసోళ్లు.. మూడు గంటల కరెంటే చాలంటూ హస్తం పార్టీ నేతలు ఓర్వలేనితనాన్ని వెళ్లగక్కిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కాంగ్రెసోళ్లదంతా అధికార యావే తప్ప.. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఏనాడూ లేదని పేర్కొంటున్నారు. తెలంగాణలో కూడా హస్తానికి ఓటేస్తే.. కర్ణాటక ప్రజల గతే మనకూ పడుతుందని మాట్లాడుకుంటున్నారు. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దిన సర్”కారు’కే ఓటేస్తామని స్పష్టంచేస్తున్నారు. కేసీఆర్ హయాంలోనే కావాల్సినంత కరెంటుతో రైతులు, సామాన్యులు, పరిశ్రమలకు చెందినవారు కంటినిండా నిద్రపోతున్నారని వెల్లడించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజలు నమస్తే తెలంగాణతో మనోగతాన్ని పంచుకున్నారు.
నిరంతరం త్రీఫేస్ కరెంట్..
టీడీపీ, కాంగ్రెస్ హయాంలో త్రీఫేస్ కరెంట్ సరఫరాలో టైమింగ్ ఉండేది. ఏడు గంటల త్రీఫేస్ సరఫరాలో రెండు, మూడు గంటలపాటు కోత ఉండేది. నా గిర్నీ సరిగ్గా నడిచేది కాదు. పిండి పట్టించుకునేందుకు వచ్చినవారు గంటలతరబడి కూర్చునేవాళ్లు. ఇప్పడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో నిరంతరం త్రీఫేస్ కరెంటు వస్తున్నది.
– సయ్యద్ జిలానీ, పిండి గిర్నీ యజమాని, నవీపేట
సింగపూర్ నుంచి తిరిగొచ్చిన..
చందూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ పాలనలో కరెంటు సరిగ్గా లేకపోవడంతో సొంతూరిలో ఉపాధి దొరకలేదు. దీంతో పనికోసం సింగపూర్ పోయిన. కేసీఆర్ వచ్చినంక తెలంగాణలో మార్పు వచ్చిందని తెలుసుకొని, తిరిగి వచ్చిన. నా పనికి మొత్తం కరెంటుతోనే సంబంధం ఉంటుంది. 24 గంటలు కరెంటు ఇస్తుండడంతో ఇప్పుడు ఎలాంటి బాధ లేకుండా పని చేసుకుంటున్న. ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ కృషితో కరెంటు సరఫరాలో ఇబ్బందులు లేవు. ప్రశాంతంగా పనిచేసుకొని బతుకుతున్నాం.
– నన్నే లక్ష్మణ్, వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు, చందూర్
వ్యవసాయం పండుగ..
కోటగిరి, ఆగస్టు 19: ఉమ్మడి పాలనలో విద్యుత్ కోతలతో ఇబ్బంది పడ్డాం. పంటలకు నీరు పెట్టేందుకు అర్ధరాత్రి కాపు కాసేటోళ్లం. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి. కరెంటు మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండె. సకాలంలో మరమ్మతులకు నోచుకోలేక పంటలు ఎండిపోయేవి. ఇపుడా పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత గృహ అవసరాలు, పరిశ్రమలకు విద్యుత్తు అందిస్తూ మరోవైపు పంటలకు 24గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. 24 గంటల కరెంట్తో తనలాంటి ఎందరో రైతులకు ధైర్యం వచ్చింది.
-పోతురాజు అంజనేయులు, రైతు, దోమలెడ్గి, పొతంగల్ మండలం.
కాంగ్రెసోళ్ల పాలనలో చాలా కష్టాలను చూసినం..
బాన్సువాడ టౌన్, ఆగస్టు 19: సమైక్యపాలనలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు పోతుండె. మా టిఫిన్ సెంటర్ వాళ్లకు ఉదయం గిరాకీ సమయానికి కరెంటు లేక ఇబ్బందులు తలెత్తేవి. లక్షలు పోసి దందా పెట్టుకుంటే కరెంటు కష్టాలతో తీసుకొచ్చిన అప్పుల సంగతి దేవుడెరుగు. వడ్డీలు కట్టడానికి కూడా రోజువారీ గళ్లా వెళ్లకపోయేది. కాంగ్రెసోళ్ల పాలనలో చాలా కష్టాలను చూశాం. ఏ తిప్పలు పడుతున్నాడో సీఎం కేసీఆర్.. కరెంటు మీద ఆధారపడి నడిచే మాలాంటి చిన్నాచితక వ్యాపారులకు ఉపయోగపడేలా 24గంటల కరెంటు అయితే ఇస్తుండు.
– స్వరూప, టిఫిన్ సెంటర్, నిర్వాహకురాలు, బాన్సువాడ
కేసీఆర్ సారుమళ్లీ సీఎం కావాలే
బాన్సువాడ రూరల్, ఆగస్టు 19: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 24గంటల నాణ్యమైన విద్యుత్ను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కాంగ్రెస్ పాలనలో చాలీ, చాలని కరెంట్ సరఫరాతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. కేసీఆర్ సీఎం అయ్యాక నిరంతరం కరెంట్ సరఫరా అవుతుంది. దీంతో మా వ్యాపారం చాలా బాగున్నది. ఇతర రాష్ర్టాల కూలీలకు పనులు కల్పించి వారికి ఉపాధి అందించడంతోపాటు మాకూ మంచి లాభాలు వస్తున్నాయి. 24గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ను కాదని, మూడు గంట లు కరెంట్ చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొడతారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాం గ్రెస్ హామీలను అమలు చేయడం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్న వార్తలు చూస్తున్నాం. తెలంగాణలో రైతులకు, మాలాంటి వ్యాపారులకు 24 గంటల కరెంట్ కావాలే.. కేసీఆర్ సారే మళ్లీ సీఎం అవ్వాలె..
– తుకారాం, ఇటుకబట్టి వ్యాపారి, బాన్సువాడ.
కాంగ్రెస్ పార్టీవి కల్లబొల్లి మాటలే..
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతుల్ని అవమానించిండు. రైతుల కష్టాలు తెలుసుకొని సీఎం కేసీఆర్ సార్ 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెసోళ్ల కండ్లు మండుతున్నాయి. వారికి రైతుల కష్టం ఏం తెలుసు. రైతుగా, రైతు బిడ్డగా రైతులకు ఏం కావాలో సీఎం కేసీఆర్ సార్కు తెలుసు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చేందుకు కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. వారి మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. వారెన్ని హామీలు ఇచ్చినా ప్రజలు తిరస్కరిస్తారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉన్నది.
– దామరంచ సాయిలు, పౌల్ట్రీ రైతు, బోర్లం.
నిరంతర విద్యుత్తో పుష్కలంగా సాగు..
ఉమ్మడి రాష్ట్రంలో చాలీచాలని విద్యుత్తో అనేక ఇబ్బందులు పడ్డాం. సరైన కరెంటు లేక ఏసిన పంటల ఏసినట్లే ఎండిపోయేవి. బోరు మోటార్లు కాలిపోయి, చేతికొచ్చిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయేటోళ్లం. కేసీఆర్ సీఎం అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి 24గంటల కరెంటు ఇవ్వడంతో మా పంటలకు పుష్కలంగా సాగు నీరు అందుతుంది. కాంగ్రెస్, టీడీపీ హయాంలో సరైన విద్యుత్ సరఫరా లేక రైతులు వ్యవసాయానికి దూరం అయ్యారు. కేసీఆర్ అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు వరంగా మారింది. కాంగ్రెస్ నాయకులు మూడు గంటల విద్యుత్ చాలని రైతులను ఆగం చేసే కుట్రలు పన్నుతున్నారు. అసొంటి కాంగ్రెస్కు పాలనా పగ్గాలు అందించం.
– ధారవత్ శ్రీనునాయక్, రైతు, బోర్లం క్యాంపు.
ఆ బాధలు మళ్లీ జీవితంల రావొద్దు..
మోర్తాడ్, ఆగస్టు19: రాత్రు ల్లో కరంటు కోసం పొలాలకాడికి పోయి పండుకోవడం. ఎప్పు డు ఇస్తరా అని కరం టు కోసం ఎదురుజూసుడు అసొంటి బాధలు మళ్ల జీవితంల రావొద్దు. ఎటుపోదమ న్నా పోరాకుండా, పందమ న్నా పండరాకుండా, పంట ఎండుతుందా? పండుతుందా? తెల్వకుండా నరకయాతన అనుభవించిన రోజులు.. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అని దూరమైనయ్. అప్పట్ల కరంటు ఎప్పుడు వస్తుందో తెలియకపోతుండే. మా ఊర్ల ఊ అంటే కరంటుపోతుండే, మంత్రి ప్రశాంత్రెడ్డి పుణ్యమా అని సబ్స్టేషన్ కూడా అయ్యింది. ఇప్పుడు భారీ వర్షాలు పడ్డా కరంటు పోతలేదు. తెలంగాణల కరంటు ఉన్నట్లు ఏరాష్ట్రంల గూడా ఉంటలేదు. తెలంగాణను కరంటు విషయంలో ఈ స్థాయికి తీసుకువచ్చిండ్రంటే.. కేసీఆర్ సార్తోనే సాధ్యమయ్యింది.
– జలంధర్, రైతు దోన్పాల్
24 గంటల కరంటు ఊహించనిది
వ్యవసాయానికి 24గంటల కరంటు అనేది రైతులమెవరమూ ఊహించనిది. ఇంతకుముందు ఫలానా టైంల కరం టు అని రాత్రి, పగలు ఇచ్చేవాళ్లు. అదే టైంకు రైతులంతా మోటార్లు చాలు జేయడం, లోడ్ పెరిగి మోటార్లు, స్టార్టర్లు కాలిపోవుడు, రాత్రుల్లో కరంటు కోసం తోటళ్ల పండుకునుడు.. రైతు బతుకు ఆగమాగం ఉండే. ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉంటున్నమన్నది నిజం. 24గంటల కరంటు ఇవ్వడంతో రైతు ఇష్టమచ్చినప్పుడు నీళ్లను పారిచ్చుకుంటుండు. ట్రాన్స్ఫార్మర్ల మీద లోడ్ పడ్తలేదు. మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు తగ్గిపోయింది. దీంతో మాకు ఖర్చు కూడా తగ్గింది. దేశచరిత్రలోనే ఇంత నాణ్యమైన కరంటును ఇస్తున్నారంటే అది కేవలం సీఎం కేసీఆర్తోనే సాధ్యమయ్యింది.
– ప్రభుదాస్, రైతు తిమ్మాపూర్
మంచినూనెతో దీపాలు వెలిగించుకునేటోళ్లం..
నవీపేట, ఆగస్టు 19: పదేండ్లకన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెం ట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో అసలే తెలిసేది కాదు. రాత్రి సమయంలో కరెంట్పోతే పిల్లలు చిమ్మచీకట్లో ఏడ్చే వారు. కిరోసిన్ లేకపోతే అప్పటికప్పుడు ఒక దీపెంతలో మంచి నూనెపోసి వత్తులు పెట్టి వెలిగించేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కరెంట్ బాధలు లేవు. ఎప్పుడు చూసినా కరెంట్ ఉంటుంది. పదేండ్లుగా కరెంట్ తిప్పలు లేకుండా చూస్తున్న సీఎం కేసీఆర్నే మళ్లీ గెలిపిస్తాం.
– తుంగిని సుజాత, పోతంగల్, నవీపేట
ఉపాధికి ఊతం వచ్చింది.
దోమకొండ, ఆగస్టు 19: నిరంతరం కరెంటు ఉంటేనే మాకు ఉపాధి దొరుకుతుంది. గతంలో చిన్నతరహా పరిశ్రమలకు నాలుగైదు గంటల కరెంటు మాత్రమే సరఫరా చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. 24గంటల కరెంటుతో చేతినిండా పనిచేసుకుంటున్నాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
– కమ్మరి గంగాధర్, లైట్మిషన్ నిర్వాహకుడు, దోమకొండ
కాంగ్రెస్కు గుణపాఠం చెబుతాం..
నవీపేట, ఆగస్టు 19: కేసీఆర్ సీఎం అయినంక కరెంటు కోసం మా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. టీడీపీ,కాంగ్రెస్ల హయాంలో కరెంట్ కోతలతో ముప్పుతిప్పలు పడేటోళ్లం. రాత్రివేళలో కరెంట్ పోయిందంటే టార్చిలైట్లు వేసుకొని పొలానికి వెళ్లి అక్కడే పడుకొని కరెంట్ రాగానే మోటర్లు స్టార్ట్ చేసేటోళ్లం. పేరుకే ఏడు గంటలనే త్రీఫేస్ సరఫరా.. మూడు గంటల కోత ఉండేది. కరెంట్ ఇబ్బందులు లేకుండా చూస్తున్న సీఎం కేసీఆర్ సార్ చల్లంగా ఉండాలె.. రాబోయే ఎన్నికల్లో తప్పుడు హామీలతో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్కు రైతులందరం కలిసి గుణపాఠం చెబుతాం.
– మెగావత్ జగ్మాల్, శివతాండ, నవీపేట
పనులు సజావుగా నడుస్తున్నాయి..
రెంజల్, ఆగస్టు 19: నా పేరు షేక్ అహ్మద్. మాది రెంజల్ మండలం కందకుర్తి. 23 ఏండ్లుగా కార్పెంటర్గా పనిచేస్తున్న. నేను చేసే పని కరెంటు ఉంటే తప్ప కాదు. కాంగ్రెసోళ్ల పాలనలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంటు కోతలు ఉండేవి. దినమంతా పనులు లేక ఖాళీగా ఉండేటోళ్లం. రాత్రంతా నిద్రాహారాలు మాని పనులు చేస్తే తప్ప దుకాణం కిరాయి చెల్లించే పరిస్థితి ఉండేది. ఒక కొత్త ఇంటికి పని చేయాలంటే నెల రోజులైతుండె. సకాలంలో కరెంటు లేక విరక్తి చెందేవాళ్లం. ఇప్పడు పరిస్థితి మారింది. నెలరోజుల్లో జరిగే పనులు వారం రోజుల్లోనే పూర్తి చేసుకుంటున్నాం. సకాలంలో యజమానులకు పనులు చేసి పెడుతున్నాం. చిన్న పరిశ్రమలకు బాసటగా నిలిచిన సీఎం కేసీఆర్ తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఇంకా కరెంటు కష్టాలు ఉన్నాయి. తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
– షేక్ అహ్మద్, కార్పెంటర్, కందకుర్తి
కరెంట్ పోయే సమస్యే లేదు..
సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఫుల్గా ఉంటుంది. కరెంట్ పోయే సమస్య లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పాలనలో కరెంట్ పోతుంటే. పొద్దుగాళ్ల పోతే రాత్రికి వస్తుండే. అప్పటి వరకు పిండిగిర్నీ అట్లనే ఉంటుండె. కరెంట్ లేకపోవడంతో గిరాకీ లేకపోతుండే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక 24 గంటలపాటు కరెంట్ ఫుల్గా ఉంటుంది. గిరాకీ బాగానే అవుతున్నది. కరెంట్ మీద ఆధారపడి జీవించే వాళ్లకు కేసీఆర్ పాలన చాలా మంచిగా ఉంది.
– మాశెట్టి సాయిప్రసాద్, పిండి గిర్నీ, కోటగిరి.
కాంగ్రెస్ హయాంలో కష్టాలు పడ్డాం..
నా పేరు శ్రీనివాస్. నేను 1986 నుంచి రేడియోతోపాటు టీవీ ఇతరాత్ర మెకానిక్ పనులు చేస్తున్న. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కరెంటు సరిగ్గా ఉండకపోతుండె. పొద్దున 6గంటలకి పోతే సాయంత్రం 6గంటలకే వస్తుండె. కరెంట్ కోసం నానా తిప్పలు పడ్డాం. కరెంట్ లేకపోవడంతో రిపేర్ పనులు ఆగిపోయేవి. గిరాకీ కూడా కాకుండే. కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్ సమస్య పూర్తిగా పోయింది. ఆయన ఏం చేస్తున్నాడో.. ఎలా చేస్తున్నాడో కానీ ప్రజలకు మాత్రం 24 గంటలపాటు కరెంట్ అందేలా చేస్తుండు. 24గంటలు కరెంటు సరఫరా చేస్తూ మాలాంటి వారి ఉపాధిని కాపాడుతున్నడు.
– అలంపల్లి శ్రీనివాస్, రేడియో, టీవీ మెకానిక్, కోటగిరి