బాన్సువాడ/ నిజాంసాగర్/ కోటగిరి/ వర్ని, అక్టోబర్ 30: బాన్సువాడ పట్టణంతోపాటు జుక్కల్ మండలంలోని జుక్కల్ చౌరస్తా గులాబీ మయంగా మారింది. సోమవారం బాన్సువాడ, జుక్కల్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన జాతరను తలపించాయి. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల నలుమూలల నుంచి వేలాదిమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. బాన్సువాడ సభలో గాయని మధుప్రియ పాడిన గులాబీల జెండాలే రామక్క … కేసీఆర్ బాపూ.. పాటకు సభా ప్రాంగణంలో మహిళలు నృత్యాలు చేశారు. ఆనందంతో కేరింతలు పెట్టారు. జుక్కల్లో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. బాన్సువాడలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేశారు. గ్రామాల నుంచి వచ్చిన వారికి సభలో తాగునీటి సౌకర్యంతోపాటు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నేపథ్యంలో ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు అదనపు ఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలు, మిగిలిన సిబ్బందితో కలిసి సుమారు 700 మంది బందోబస్తులో పాల్గొన్నారు.
వ్యవసాయం అంటే భయపడే రోజుల నుంచి పండుగ చేసుకునే రోజులు వచ్చాయి. సీఎం కేసీఆర్ రైతును రాజు చేసిండు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుచుడు ఖాయం.
గడిచిన ఐదేండ్ల కాలంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందజేసిన లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సారి లక్ష మెజారిటీతో ఆయనకు పట్టం కడతాం.
ఇన్నేండ్లల్ల ఇసుంటి సీఎం కేసీఆర్ సారసుంటి వ్యక్తిని నేనెన్నడూ సూడలే. ఆయనను సూసేందుకు పొద్దుగాళ్లనే బుర్నాపురం నుంచి మీటింగ్ కాడికి అచ్చిన. ఈయన అచ్చినంకనే మాకు పింఛన్ పైసలు, రైతుబంధు పైసలు అస్తున్నై.
సీఎం కేసీఆర్ సారు నాకు పెద్దకొడుకసుంటోడు అయిండు. మా ఇంట్ల పిల్ల కు పెండ్లి చేస్తే కల్యాణలక్ష్మి కింద లక్ష నూట పదహారు ఇచ్చి ఆదుకున్నడు. ఇసుంటి సారు మల్ల గెలువాలే. ఆయనను మళ్లొక్కసారి గెలిపించుకుంటాం.
సీఎం కేసీఆర్ అచ్చినంకనే మాకు సమయానికి పింఛన్లు, పంట పెట్టుబడికి రైతుబంధు, 24 గంటల కరెంటుతోని ఆదుకుంటుండు. కేసీఆర్ సారు మళ్లా సీఎం అయితనే మేము, మా అసుంటోళ్లందరం బాగుంటం.