లింగంపేట/ పిట్లం/ తాడ్వాయి, ఫిబ్రవరి 9: రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఉద్యోగులకు తీపి కబురు అందించగా.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తీరని కలగా మారిన పేస్కేల్ను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చడంపై నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలోని వందలాది మందికి లబ్ధిచేకూరనుండడంతో ఉద్యోగులు సంబురాలు చేసుకొంటున్నారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లాలోని లింగంపేట, పిట్లం, తాడ్వాయి మండల కేంద్రాల్లోని సెర్ప్ కార్యాలయాల్లో ఉద్యోగులు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏండ్లుగా చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న సెర్ప్ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు అందిస్తామని ప్రకటించడం హర్షణీయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకున్నాయే తప్ప .. వారి సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో పేస్కేల్ అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. లింగంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఎం చామంతి శ్రీనివాస్, సీసీలు, పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీఎం శిరీష , ఐకేపీ ఉద్యోగులు శాంత, హన్మాండ్లు, ఉత్తమ్, అంజయ్య, ముత్యంరెడ్డి, రాజు, తాడ్వాయి మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏపీఏం రవీందర్, సీసీలు సాయిబాబా, ప్రసాద్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.