ఐదో విడుత పల్లెప్రగతి విజయవంతం
15 రోజులపాటు పండుగ వాతావరణంలో..
ఊరూరా జరిగిన పారిశుద్ధ్య పనులు
స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, ప్రజలు
మంత్రి ఎర్రబెల్లి పర్యటనతో ఉభయ జిల్లాల్లో చలనం
వైకుంఠధామాల్లో మౌలిక వసతుల కల్పనలో అదే నిర్లక్ష్యం
పచ్చదనం, పరిశుభ్రతతో ఊరూవాడా కళకళలాడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతమైంది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన పల్లె ప్రగతిలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో 15 రోజులపాటు గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు సాఫీగా సాగాయి. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను తొలగించారు. వంగిన, తుప్పుపట్టిన విద్యుత్ స్తంభాలను తొలగించి వేలాడుతున్న తీగలను సరి చేశారు. మురుగు కాలువలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టారు. స్థలాలు ఉన్న చోట తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. దాతల నుంచి విరాళాలు సేకరించి గ్రామాభివృద్ధికి కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి పర్యటించి.. పల్లెప్రగతి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నిజామాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి దిగ్విజయంగా పూర్తయ్యింది. జూన్ 3న ప్రారంభమైన ఐదో విడుత పల్లె ప్రగతిలో 15రోజుల పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మంత్రులు, కలెక్టర్ పాల్గొన్నారు. ప్రారంభ ఆర్భాటాలకే పరిమితం కాకుండా… ఆదర్శవంతంగా పనులను చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు మెరుగుకావడంతో ప్రజల ఇక్కట్లు తొలగిపోయాయి. అధికార యంత్రాంగమంతా పల్లెబాట పట్టడంతో గ్రామాలన్నీ సందడిగా దర్శనం ఇచ్చాయి. పండుగ వాతావరణంలో హరితహారం, పరిసరాల పరిశుభ్రత, చెత్త సేకరణ, అసంపూర్తి పనులను చేపట్టడం మూలంగా మేలు చేకూరింది. పక్కా ప్రణాళికతో పచ్చదనం, పారిశుద్ధ్య పనులు ఉధృతంగా నిర్వహించారు. వైకుంఠధామాలను జూన్ 18నాటికి వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన వసతులను కల్పించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్రెడ్డి స్వయంగా ఆదేశించగా అధికార యంత్రాంగంలో అక్కడక్కడా చలనం కనిపించింది. పలుచోట్ల డెడ్లైన్ ముగిసినప్పటికీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా సౌకర్యాల కల్పన పూర్తికాలేదని తెలిసింది. పల్లె ప్రగతిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను, వినియోగంలో లేని వందలాది బోర్లను, బావులను పూడ్చివేశారు.
నిజామాబాద్లో భేష్…
నిజామాబాద్ జిల్లాలో పల్లెప్రగతి విజయవంతమైంది. 1873 కిలోమీటర్ల రోడ్లు, 1774 కిలోమీటర్ల మేర మురుగు కాలువలను శుభ్రం చేశారు. 28 62 ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత చర్య లు చేపట్టారు. శిథిలావస్థకు చేరిన 624 ఇండ్లను తొలగించారు. 2176 స్థలాల్లో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు తొలగించారు. 1125 ప్రాంతాల్లో గుంతలు, 693 నీటి నిల్వ ప్రాంతాలను పూడ్చారు. 844 ప్రాంతాల్లో స్తంభాలకు థర్డ్వైర్ ఏర్పాటు చేశారు. వీధి దీపాలు, నీటి సరఫరా కోసం 40ప్రాంతాల్లో కరెంట్ మీటర్లు లేని వాటిని గుర్తించి బిగించారు. 770 వంగిన, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను తొలగించారు. 1091 వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేశారు. 124 క్రీడా ప్రాంగణాలను ఏ ర్పాటు చేశారు. 743 మంది దాతల ద్వారా విరాళాలు సేకరించగా ఆ వస్తువుల మొత్తం రూ.90.91 లక్షలను గ్రామాల్లోనే ఖర్చు చేశారు. 474 ఇంకుడు గుంత లు, 261 సామూహిక ఇంకుడు గుంతలను నిర్మించారు. 23 పని చేయని బోర్లు, నిరుపయోగంగా ఉన్న 72 బావులను పూడ్చి వేశారు. 84 వైకుంఠధామాల్లో విద్యుత్ సౌకర్యం, 100 వైకుంఠధామాలకు నీటి సౌకర్యం కల్పించారు. 367 కిలోమీటర్ల పొడవు మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలను నా టారు. 24 ప్రాంతాల్లో బృహత్ పల్లెప్రకృతి వనాల ను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించారు.
బాన్సువాడ మండలం దేశాయిపేటలో మొక్కను నాటుతున్న స్పీకర్, మ్ంరత్రులు, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ(ఫైల్)
భీమ్గల్ మండలం పురాణీపేట్లో పల్లె ప్రగతి పనుల్లో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు(ఫైల్)
కామారెడ్డిలో తూతూ మంత్రంగా…
కామారెడ్డి జిల్లాలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తూతు మంత్రంగా చేపట్టారు. ఇందుకు అధికారులు వెల్లడిస్తున్న గణాంకాలే దర్పణంగా నిలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీల్లో 10,743కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రం చేయించారు. 1,338 కిలోమీటర్లు మురుగు కాలువల్లో పూడిక తొలగించారు. 633 శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి 15 రోజుల కార్యక్రమంలో యజమానులకు అవగాహన కల్పించి వాటిని పూర్తిగా తొలగించారు. ఏకధాటి వానలతో భవనాలు ఒరిగిపోవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని ప్రజలకు వివరించారు. వారి సమ్మతితో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను నేలమట్టం చేశారు. రోడ్ల మధ్యలో రాకపోకల కు ఇబ్బందిగా ఉన్న 1061 గుంతలు, 70 బోరుబావులను పూడ్చేశారు. 240 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారు. 50 సామూహిక ఇంకుడు గుంతలను ఆయా చోట్ల చేపట్టారు. ఇంకుడు గుంతల నిర్మాణాల్లో వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తున్నది. విద్యుత్కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కామారెడ్డి జిల్లాలోని ఎన్పీడీసీఎల్ సిబ్బంది పట్టనట్లు వ్యవహరించారు. పల్లెప్రగతిలో వారి పాత్ర అంతంత మాత్రంగానే కనిపించిందని ప్రజలు చెబుతున్నారు. ఇక వైకుంఠధామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదేశాలిచ్చినప్పటికీ ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కాలేదు.
బయటపడిన సమన్వయ లోపం..
పల్లెప్రగతి ఐదో విడుత కార్యక్రమంలో అక్కడక్కడా లోపాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా జిల్లాస్థాయి అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బయటపడింది. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నిజామాబాద్ జడ్పీలో జరిగిన ఉభయ జిల్లా సమీక్షలోనే ఈ అంశంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి చివరి రోజు జూన్ 18 నాటికి వైకుంఠధామాల్లో విద్యుత్ కనెక్షన్లు, నీటి వసతి కల్పించాలని మిషన్ భగీరథ, ఎన్పీడీసీఎల్, మండల అభివృద్ధి అధికారులకు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. నిజామాబాద్లో కాసింత మెరుగుదల కనిపించగా కామారెడ్డిలో కనీసం పట్టనట్లు వ్యవహరించినట్లు తెలుస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా కామారెడ్డిలో మిషన్ భగీరథ, ఎన్పీడీసీఎల్, ఎంపీడీవోలు వ్యవహరించడం మూలంగా పలు వైకుంఠధామాల్లో అసంపూర్తిగా పనులు మిగిలినట్లు తెలుస్తుంది. మంత్రుల సమీక్ష అనంతరం కలెక్టర్ స్వయంగా పలువురు పంచాయతీ అధికారులను గట్టిగానే మందలించారు. పలువురిపై శాఖాపరమైన చర్యలు సైతం తీసుకున్నారు.