ఆర్మూర్, మే 5: పసుపు సాగులో మన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నది. దేశంలో పండించే మొత్తం పసుపులో సగం ఉత్తర తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతోంది. ప్రధానంగా పసుపును నిజామాబాద్ జిల్లా రైతులే అధికంగా సాగుచేస్తారు. పచ్చబంగారంగా పిలిచే పసుపు సాగులో ఆర్మూర్ ప్రాంత రైతులు ఎప్పటికప్పుడు అధునాత పద్ధతులను అవలంబిస్తున్నారు. నాణ్యమైన పంటను ఉత్పత్తి చేస్తున్నారు.
రెండు గంటలు.. రూ.10వేలు ఆదా..
పసుపు సాగు చేసేందుకు ఎకరాకు లక్ష రూపాయల పెట్టుబడి అవుతున్నది. దుక్కి దున్నేందుకు రూ. 5 వేలు, విత్తనాలకు రూ. 13 వేలు, ఎరువులకు రూ. 12వేలు, అడుగు మందుకు రూ. 7వేలు, కలుపు తీసేందుకు రూ. 12వేలు, పసుపు తవ్వడానికి రూ. 12వేలతోపాటు ఉడకబెట్టి, పాలిష్ చేయడానికి మరో రూ. 10 వేలు, ఇతరత్రా ఖర్చు చేస్తున్నారు. కాగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల పసుపు దిగుబడి వస్తున్నది. పసుపు సాగులో కూలీలకే అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఈ వ్యయాన్ని తగ్గించుకునేందుకు రైతులు యాంత్రీకరణ వైపు దృష్టి సారిస్తున్నారు. ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన నలిమెల చిన్నారెడ్డి అనే యువరైతు పసుపు తవ్వేందుకు ఓ యంత్రాన్ని కొనుగోలు చేశాడు. దీనిని రూ. లక్షా 50 వేలతో మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకున్నాడు. పసుపు తవ్వే యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా కూలీల ఖర్చుతోపాటు సమయం కూడా ఆదా అవుతున్నదని చిన్నారెడ్డి తెలిపాడు. ఎకరం పసుపును తవ్వేందుకు కూలీలకు రూ. 12వేలు చెల్లిస్తుండగా రోజంతా సమయం పడుతున్నదని, ఈ యంత్రం ద్వారా డీజిల్, డ్రైవర్ చార్జీలు కలిపి వెయ్యి రూపాయలు మాత్రమే అవుతున్నదని చెప్పాడు. ఎకరం పసుపును రెండు గంటల్లోనే తవ్వొచ్చని తెలిపాడు. ఎకరానికి రూ.10 వేల వరకు మిగులుతున్నాయని వివరించాడు.
సబ్సిడీపై అందజేస్తే రైతులకు మేలు
పసుపు తవ్వే యంత్రాన్ని కొనుగోలు చేయాలంటే రైతులకు భారమే. రూ. లక్షా 50వేల విలువ చేసే ఈ యంత్రాన్ని స్పైసెస్ బోర్డ్, వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై అందజేస్తే బాగుంటుంది. కూలీలు రోజంతా చేసే పనిని ఈ యంత్రం ద్వారా రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు. కూలీలకు అయ్యే ఖర్చు కూడా రూ.10 వేల దాకా తగ్గుతున్నది.
-నలిమెల చిన్నారెడ్డి, పసుపు రైతు, మగ్గిడి, ఆర్మూర్ మండలం