ఖలీల్వాడి, డిసెంబర్ 25: కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనాలో కేసులు లక్షల సంఖ్యలో నమోదవుతున్నాయి. రాబోయే మూడు నెలల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. ఓ నివేదిక ప్రకారం వచ్చే మూడు నెలల్లో ప్రపంచంలో పదిశాతం కన్నా ఎక్కవ మంది వైరస్ బారిన పడే అవకాశం ఉంది. మన దేశానికి ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కేసుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాబోయ రోజుల్లో కొత్తగా ఆంక్షలు అమలుచేసే అవకాశం ఉంది. వీటిని అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రస్తుతానికి దేశంలో పెద్దగా ప్రమాదమేమిలేదని చెప్పారు. అయినప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ ప్రొటోకాల్స్ను మళ్లీ అమలుచేసే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దేశంలో కొత్త వేరియంట్ బీఎఫ్-7 వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఒరిస్సా, గుజరాత్, మహారాష్ట్రలో కేసులు నమోదైనట్లు సమాచారం. 2020-21 సంవత్సరంలో కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జనజీవనం కకావికలమైంది. ఒమిక్రాన్ వెరియంట్ కన్నా శక్తివంతమైనది బీఎఫ్-7. బలమైన ఇన్ఫెక్షన్ కలిగి ఉంటుందని, జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పక్క రాష్ట్రంలోకి నూతన వేరియంట్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు.
కరోనా మహమ్మారిని మరోసారి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనాపై ఆందోళన వద్దని, అయితే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఇటీవల నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని, బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 500 బెడ్లు ఉండగా.. ఆదనంగా మరో 200 బెడ్లు కరోనా వార్డులో సిద్ధం చేసినట్లు వైద్యశాఖాధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తోంది. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు అన్నికూడా పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నది.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కరోనా లక్షణాలున్న వారికి నిబంధనలు కఠినంగా అమలుచేసే అవకాశాలున్నాయి. దగ్గు, జలుబు తదితర ఏ సమస్యతో బాధపడుతున్నా మాస్కులు తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
కరోనా సెకండ్వేవ్ తర్వాత జనం భౌతిక దూర నియమాన్ని పాటించడం పూర్తిగా మానేశారు. మళ్లీ ఈ నిబంధనను అమలుచేసే అవకాశం ఉం ది. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకునేలా ఏర్పా ట్లు చేస్తున్నారు. దీనిపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. కరోనా కేసులు పెరుగకుండా నిరోధించడానికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై దృష్టిసారించాలని నిర్ణయించారు.
కరోనా గతంలోనూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడే కరోనాను ఎదుర్కోవచ్చు. ఎలాంటి అపోహలకు గురి కాకుండా ఉండాలి. మానసిక బలం ముందు కరోనా ఓడిపోతుంది. మన బలమే మనల్ని గెలిపిస్తోంది. మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలి.
-డాక్టర్ విశాల్ , మానసిక వైద్య నిపుణుడు