ధర్పల్లి/రామారెడ్డి/సిరికొండ, ఫిబ్రవరి 24 ;ఎన్నో ఆశలతో యాసంగి వరిసాగుచేస్తున్న రైతు పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. దీంతో భూములు నెర్రెలుబారి పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటివరకు ఎలాగో నెట్టుకొచ్చిన అన్నదాతకు చివరి తడిపై బెంగ మొదలైంది. రైతులకు పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి నెలకొన్నది. బోరుబావులు ఎత్తిపోయి పంటలకు నీరందక కండ్లముందే ఎండిపోతుండడంతో ఏం చేయాలో అర్థంకాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. నెర్రెలుబారుతున్న నేలలను చూసి కన్నీరు పెడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని దుబ్బాక, రేకులపల్లి, వాడి తదితర గ్రామాల్లో వరి పంటలకు వారం రోజులగా నీటి తడులు అందడంలేదు. పంట ఎండిపోవడం చూసి తట్టుకోలేక వాడి గ్రామానికి చెందిన ఓ రైతు 500 ఫీట్ల మేర రెండు బోరుబావులు తవ్వించాడు. అయినా నీటి జాడలు కనిపించలేదు. అటు పంట పెట్టుబడికి, ఇటు బోర్ల కోసం లక్షల్లో ఖర్చుచేసి లబోదిబోమంటున్నాడు. దుబ్బాక గ్రామానికి చెందిన శేఖర్రెడ్డికి చెందిన వరి పొలం సైతం ఎండిపోతున్నది. ఇంత జరుగుతున్నా రైతులను పట్టించుకునేవారు కరువయ్యారు. వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించడం లేదు. కనీసం ధైర్యం చెప్పేవాళ్లు లేక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మరో 15 రోజులైతే పంటలు పూర్తిగా ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి, కొండాపూర్, గడ్కోల్, రామడ్గు, చిన్నవాల్గోట్, హుస్సేన్నగర్, కొండూర్, పెద్దవాల్గోట్, పోత్నూర్ రైతులు కప్పలవాగుపై నమ్ముకొని బోరుబావుల ద్వారా వరి సాగు చేస్తున్నారు. మైలారం, న్యావనంది, రావుట్ల రైతులు చెరువుల కింద సాగు చేస్తారు. పదేండ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భజలాల తగ్గిపోయి బోర్లు వట్టిపోతున్నాయి. ఫలితంగా పొట్ట దశలో ఉన్న వరి ఎండిపోతున్నది. కొందరు రైతులు పంటను కాపాడుకోవడానికి ట్యాంకర్ల ద్వారా పంటకు నీటిని అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రలోనూ ఇదే దర్భర స్థితి నెలకొన్నది. చాలా వరకు బోరుబావులు వట్టిపోతున్నాయి. దీనికి తోడు అనధికార కరెంటు కోతలు కూడా రైతులను భయపెడుతున్నాయి. ఎండలు ముదరక ముందే యాసంగి పొలాలకు సరిగా నీరందడంలేదు. వేలల్లో పెట్టుబడి పెట్టి అప్పులపాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ పట్టించుకుంటలేరు..
యాసంగి వరి చేతికి రావాలంటే ఒకటి రెండు తడులకు నీరు కావాలె. కానీ, పరిస్థితి చూస్తే కాలం కలిసి వచ్చేటట్టులేదు. పంట మొత్తం ఎండిపోతున్నది. గతంలో ఎన్నడూ ఇంత అధ్వానంగా చూడలేదు. బోర్ల నుంచి చుక్క నీరు రావడంలేదు. మొన్నటి కాదా పచ్చగా ఏపుగా పెరిగిన మా పొలం ఎండిపోతున్నది. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదు. ఇంతవరకు ఏ ఒక్క అధికారి వచ్చి చూడలేదు. ఆదుకునే ప్రయత్నం చేస్తలేరు. నాలాగ చాలా మంది రైతులు సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నరు.
-శేఖర్రెడ్డి, రైతు, దుబ్బాక, ధర్పల్లి మండలం