ఖలీల్వాడి/ కామారెడ్డి, మార్చి 12: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తూ పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ చేపట్టాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లాలో అమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ సిబ్బందిని సన్నద్ధం చేసుకోవాలని సూచించారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ర్యాండమైజేషన్, భద్రతాపరమైన ఏర్పాట్లు తదితర అంశాలను సమీక్షిస్తూ జిల్లా ఎన్నికల అధికారులకు మార్గనిర్దేశం చేశారు. గత ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగిన పోలింగ్ కేంద్రాలను గుర్తించి, ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందుబాటులో ఉండేలా చూడాలని, తమకు పోస్టల్ బ్యాలెట్ వసతి కల్పించలేదని, ఏ ఒక్కరు కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం కల్పించొద్దని అన్నారు. వీసీలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.