మోర్తాడ్, డిసెంబర్ 13: హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జిల్లా వ్యాప్తంగా 530 నర్సరీలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో గ్రామానికి పదివేల మొక్కల చొప్పున జిల్లాలో 53లక్షల మొక్కలను పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే మట్టి, ఎరువుల సేకరణ, బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తవుతున్నాయి. విత్తనాలు, స్టంపులు తెప్పించే ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. విత్తనాలు, స్టంపులు రాగానే వారం రోజుల్లో నాటే పనులు కూడా ప్రారంభంకానున్నాయి.
హరితహారం కార్యక్రమానికి నర్సరీల్లో మొక్కల పెంపకం కోసం ఇప్పటికే బ్యాగుల్లో మట్టిని నింపే పనులు పూర్తికావస్తున్నాయి. మొక్కల పెంపకం కోసం నాణ్యమైన మొరాన్ని సేకరించి నర్సరీ స్థలానికి తరలించి, అక్కడ మొరాన్ని జాలీ పట్టించి, తగినంత సేంద్రియ ఎరువును కలిపి బ్యాగుల్లో నింపే పనులు చేపట్టారు. ఒక్కో నర్సరీలో పదివేల మొక్కలు పెంచేలా మట్టి బ్యాగులను ఏర్పాటు చేస్తున్నారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా నర్సరీల్లో పూలు, పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో పలుసార్లు ఇంటింటికీ తిరిగి ఎలాంటి మొక్కలు నాటుకుంటారు అనే సర్వేల ఆధారంగా పూలమొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. ఈసారి కానుగ, వేప నీడనిచ్చే చెట్లు, గులాబీ, మందార, గన్నేరు పూలమొక్కలు, జామ, సీతాఫలం, ఉసిరి పండ్ల మొక్కలను పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు విత్తనాలు, స్టంపుల సేకరణ చేపడుతున్నారు.
జిల్లాలోని 530 గ్రామాల్లో ఉన్న నర్సరీల్లో 53లక్షల మొక్కల పెంపకానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రానున్న హరితహారం కార్యక్రమానికి గ్రామానికి పదివేల మొక్కలు నాటడమే లక్ష్యంగా నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. వానకాలం వరకు మొక్కలు సిద్ధమయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నర్సరీల్లో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తికావస్తుండడంతో విత్తనాల సేకరణలో అధికారులు ఉన్నా రు. వారం రోజుల్లో విత్తనాలు బ్యాగుల్లో నాటడం, వాటరింగ్ పనులు ప్రారంభమ య్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరు వరకు అన్ని నర్సరీల్లో విత్తనాలు నాటే కార్యక్రమం కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే మొక్కల పెంపకం కోసం బ్యాగుల్లో మట్టి నింపే ప నులు పూర్తయ్యాయి. విత్తనాల సేకరణ చేయాలని కార్యదర్శులకు సూచించాం. విత్తనాలు రాగానే ప్రాసెసింగ్ చేయించి నా టే కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెలాఖరు వరకు అన్ని నర్సరీల్లో విత్తనాలు, స్టంపులు నాటే కార్యక్రమాలు పూర్తయ్యేలా చూస్తాం. గ్రామానికి పదివేల మొక్కలు నాటే లక్ష్యంతో నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నాం.