మహానగరానికి తాగునీటి గండం ముంచుకొస్తున్నది. బీఆర్ఎస్పై రాజకీయ కక్షతో కాళేశ్వరం నీటిని కాంగ్రెస్ సర్కార్ ఎత్తిపోయని ఫలితంగా హైదరాబాద్వాసులకు గొంతు తడుపుకోవడం మున్ముందు కష్టతరమయ్యే దుస్థితి దాపురించింది. గ్రేటర్కు తాగునీటిని సరఫరా చేసే ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి నిల్వలు గణనీయంగా పడిపోయాయి.
కన్నెపల్లి పంపులు ఆన్చేసి నీటిని ఎత్తిపోసి ఉంటే ఎల్లంపల్లి నుంచి కనీసం తాగునీరైనా అంది ఉండేది. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి రోజుకు రెండు, మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసుకొనే అవకాశం వచ్చినా రేవంత్ ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి హైదరాబాద్వాసుల జీవితాలనే పణంగా పెట్టింది. గత్యంతరం లేక ఇప్పటికే నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తుండగా మున్ముందు ‘పానీపట్టు’ యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కల్పించింది.
కరీంనగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్ మహానగరానికి మంచినీటి ముప్పు పొంచిఉన్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోవడం, ప్రభుత్వ మంచి నీటి సరఫరా తగ్గిపోవడంతో నగర ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చనున్నది. దీనికి కారణం మహానగరానికి ఏటా 10 టీఎంసీల మంచినీటిని అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎండిపోతుండటమే. ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా తగ్గించారు. మరో వారం పది రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే, ప్రాజెక్టు నుంచి మోటర్లు పెట్టి ఎత్తిపోసే దుస్థితి ఏర్పడనున్నది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరానికి సరఫరా అయ్యే నీటి వనరుల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. మరోవైపు, ఎల్లంపల్లిలో అడుగంటుతున్న జలాలు రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో (ఎన్టీపీసీ)పాటు రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)ను వణికిస్తున్నాయి. కన్నెపల్లి పంపుహౌస్లను ఆన్ చేయకుండా సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా జలసంక్షోభం తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండుతున్న ఎల్లంపల్లి
హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి కృష్ణా, గోదావరి నదులతోపాటు సింగూరు, మంజీరా, ఉస్మాన్సాగర్, హిమాయత్నగర్ నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా జలవనరుల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. సింగూరులో నీటి మట్టం డెడ్స్టోరేజీకి చేరడంతో.. నీటిని పంపింగ్ చేయడానికి ప్రత్యేక మోటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది. గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు పంపిస్తున్నారు. కేటాయింపు ప్రకారం ప్రతిరోజూ 331 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాజెక్టు నుంచి పంపించాల్సి ఉన్నది. ఈ లెక్కన నెలకు 0.86 టీఎంసీ, ఏడాదికి 10 టీఎంసీలు పంపించడానికి కేటాయింపులున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో 7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
ఇందులో 2.5 టీఎంసీలు డెడ్స్టోరేజీ. ఈ ప్రాజెక్టు నుంచి నిత్యం విభిన్న రంగాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక్క హైదరాబాద్కు తాగునీటి కోసమే కాకుండా రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ), తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ), రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్)తోపాటు మిషన్ భగీరథ కింద కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల తాగునీటి కోసం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఏటా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీలు, ఆర్ఎఫ్సీఎల్కు 1 టీఎంసీ, హైదరాబాద్ వాటర్ సరఫరాకు 10 టీఎంసీలు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, తదితర తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ కింద 1.5 టీఎంసీల కేటాయింపులున్నాయి. వీటితోపాటు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) కింద 1,600 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ నడుస్తున్నది. వీటికి 2 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇంత భారం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారుతున్నది. ఇప్పటికే, హైదరాబాద్తోపాటు వివిధ జిల్లాలకు మిషన్ భగీరథ కింద నీటిని తీసుకొనే పంపుహౌస్ల వద్ద ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్కు వారంలో కొద్ది రోజలు నీటిని తగ్గించి పంపిస్తున్నారు. నిత్యం 331 క్యూసెక్కుల నీటిని పంపించాల్సి ఉండగా, 275 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. అంటే రోజుకు 213.93 మిలియన్ గ్యాలన్ల నీటిని పంపించాల్సి ఉండగా, 177.73 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే పంపిస్తున్నారు. రోజురోజుకూ ఈ సరఫరాలో తగ్గింపు పెరిగే ప్రమాదాలున్నాయి. ఏటా 10 టీఎంసీల నీటిని హైదరాబాద్కు సరఫరా చేయడానికి బ్రాహ్మణపల్లి వద్ద పంపుహౌస్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో 141 మీటర్ల వరకు నీటి నిల్వలుంటేనే ఈ పంపుహౌస్కు లక్ష్యం మేరకు నీరు చేరుతుంది. ప్రస్తుతం నీటి నీల్వ 140.3 మీటర్ల లెవల్కు పడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ప్రాజెక్టులో రోడ్డు వేసి, 20 మోటర్లు పెట్టి ఎత్తిపోశారు. అయినా డిమాండ్కు అనుగుణంగా ఆనాడు సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తమైంది. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతం అవుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు చుక్క ఇన్ఫ్లో లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, కొద్దిరోజుల్లోనే హైదరాబాద్కు నీటిని పంపేందుకు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు, తాగునీటిని అందిస్తూ… మరోవైపు ఎత్తిపోతల పథకం కింద కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని అందించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉన్నది.
అడుగంటిన అన్నపూర్ణ.. ఎడారిలా మధ్యమానేరు
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుతో అనుసంధామైన ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అన్ని ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం దాదాపు డెడ్స్టోరేజీకి చేరుకుంటున్నది. కేసీఆర్ హయాంలో… వాటర్ హబ్గా ఉన్న మధ్యమానేరు (శ్రీ రాజరాజేశ్వర జలాశయం) ప్రాంతం ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థామర్యం 27.55 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.44 టీఎంసీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నది. దీనిపై పెట్టుకున్న ఆశలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడియాశలయ్యాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు లేకపోవడం, ఎస్సారెస్సీ నుంచి నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టు మొత్తం ఎడారిని తలపిస్తున్నది. మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ఎగువకు అంటే కొండపోచమ్మ ప్రాజెక్టు వరకు నీటిని ఎత్తిపోయాలంటే ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్కు వెళ్లాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఉన్న ఈ రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఉన్న నిల్వ 1.45 టీఎంసీలే.
ఈ ప్రాజెక్టును నింపి, అక్కడి నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్కు అక్కడి నుంచి ఎగువమానేరు వరకు కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోల ద్వారా ప్రాజెక్టులను నిండుకుండలా నింపింది. అలాగే, దిగువమానేరు జలాశయం (ఎల్ఎండీ) పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.58 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఈ ప్రాజెక్టు కూడా దాదాపు డెడ్స్టోరేజీకి చేరుకున్నది. నీరు తగ్గిపోవడం వల్ల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఆరంభమయ్యాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15.049 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి ఈ ప్రాజెక్టులో 20.90 టీంఎసీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
నాడు జల ప్రపంచం.. నేడు జల సంక్షోభం
కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన కేసీఆర్.. అత్యంత తక్కవ సమయంలో అమల్లోకి తెచ్చారు. ఇందుకోసం తవ్విన టన్నెల్స్, ఏర్పాటు చేసిన పంపుహౌస్లు, ఎత్తిపోసిన నీళ్లు, నిండుకుండలైన ప్రాజెక్టులు, పాతాళం నుంచి పైకి ఉబికి వచ్చిన నీళ్లు వంటివి ఏకంగా ఆనాడు భూగర్భ జల ప్రపంచాన్నే సృష్టించాయి. మరోవైపు, ఏడాది పొడవునా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి నది సజీవరూపం సంతరించుకున్నది. ప్రస్తు తం రాష్ట్రంలో రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్న నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ వస్తున్నది.
వివిధ ప్రాజెక్టుల్లో ప్రస్తుత పరిస్థితి
