బాన్సువాడ, మే 25 : ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఆరోగ్యవంతమైన భావి సమాజాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడు నెలల నుంచి మూడేండ్ల పిల్లలకు బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నది.
కామారెడ్డి జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1193 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 7 నెలల నుంచి మూడేండ్ల లోపు చిన్నారులు 39,121 మంది, మూడు నుంచి ఆరేండ్ల పిల్లలు 33,894 మంది ఉన్నారు. 8,315 మంది గర్భిణులు, 6,968 మంది బాలింతలు ఉన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం కారణంగా కంటిచూపు మందగించడం, చర్మ వ్యాధులు, రక్తహీనత వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఈ లోపాలను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతినెలా క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు బలవర్ధకమైన ఆహారంపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
తల్లిపాలే.. బాలామృతం!
ఐసీడీఎస్ కింద ప్రవేశపెట్టిన తల్లిపాలే బాలామృతం. దీనికి 7 నెలల నుంచి మూడేండ్ల మధ్య పిల్లలకు పౌష్టికాహారం కింద అందజేస్తారు. బాలామృతంలో వేయించిన గోధుమ పిండి, వేయించిన శనగపప్పు పిండి, చక్కెర, పాలొపడి, ఇనుము, క్యాల్షియం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. 100 గ్రాముల పరిమాణంలో ప్రతిరోజూ 3-5సార్లు పిల్లలకు తినిపించవచ్చు. ఏడాదిలోపు పిల్లలకు బాలామృతాన్ని వేడినీటిలో కలిపి గంజిగా, పెద్ద పిలలకు లడ్డూల రూపంలో అందించవచ్చు.
బాలామృతం ప్లస్..
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా రెండు జిల్లాల్లో అందజేసిన బాలామృతం ప్లస్ను మరో ఏడు జిల్లాల్లోనూ పంపిణీ చేస్తున్నారు. ఇందులో కామారెడ్డి జిల్లా కూడా ఉన్నది. రాష్ట్రవ్యాపంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రస్తుతం అందిస్తున్న బాలామృతం స్థానంలోనే బాలామృతం ప్లస్ను ఇస్తున్నారు. చిన్నారుల్లో వయసుకు తగిన బరువు, ఎదుగుదల, ఆకలి లేకపోవడం, మరుగుజ్జుతనంలో ఉండడడం, శరీరం పాలిపోయినట్టు, పాదాలకు నీరు రావడం, విసర్జన వ్యవస్థ సరిగా లేకపోవడం వంటి లక్షణాలతో ఇబ్బందిపడే చిన్నారులకు బాలామృతం ప్లస్ అందజేస్తున్నారు.
39,121 మంది చిన్నారులకు బాలామృతం..
కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్, దోమకొండలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 1193 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 39,121 మంది మూడేండ్ల లోపు చిన్నారులు ఉన్నారు. 3-6 ఏండ్ల పిల్లలు 33,894 మంది ఉన్నారు. మూడేండ్ల లోపు చిన్నారులకు ప్రతినెలా క్రమం తప్పకుండా బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. దీంతోపాటు నెలకు 16 కోడిగుడ్లు అందిస్తున్నారు. ప్రతినెలా చిన్నారుల్లో ఎదుగుదల వివరాలను సేకరిస్తున్నారు. బరువు తక్కువగా ఉండి పోషకాల లోపంతో బాధపడే వారికి నెలకు 25 కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. సరాఫరా చేస్తున్నారు.
అందరి ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
అందరి ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కోసం ప్రత్యేకంగా బాలామృతం ప్యాకెట్లను సరఫరా చేస్తున్నది. పిల్లల్లో ఎదుగుదలను ఎప్పటికప్పుడు గమనిస్తాం. పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తాం.
-మహాదేవి, ఆంగన్వాడీ టీచర్, బాన్సువాడ
చిన్నారులకు బాలామృతం వరంలాంటిది..
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బాలామృతం చిన్నారులకు వరం లాంటిది. ఇందులో ఆనేక పోషకాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ నుంచి మూడేండ్ల లోపు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందజేస్తున్నాం. చిన్నారులకు ప్రతిరోజూ వంద గ్రాముల బాలమృతం తినిపించాలి. ఆకలి మందగించడం, ఎదుగుదల లేకపోవడం, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే టీచర్లు గమనించాలి. ప్రతినెలా మొదటి తేదీన పిల్లల బరువు, ఎత్తును సేకరించాలి.
-కళావతి, ఇన్చార్జి సీడీపీవో, బాన్సువాడ ప్రాజెక్టు