కోటగిరి/ నన్రుల్లాబాద్, ఫిబ్రవరి 26: కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించేందుకు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే చరిత్ర సృష్టించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరిలోని మిర్జాపూర్క్యాంప్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడంతో ఎన్టీఆర్ చలించిపోయారని గుర్తుచేశారు. తాను ఇన్నాళ్లూ పదవులు పొందడం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని పేర్కొన్నారు. టీడీపీకి ఏమాత్రం సంబంధం లేనివారు కూడా నేడు రాజకీయ స్వార్థం కోసం గొప్పలు చెప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పోచారం సురేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.